పోలీసుల అప్రమత్తతతో భారీ ఫేక్ కరెన్సీ మోసం భగ్నం..

పోలీసుల అప్రమత్తతతో భారీ ఫేక్ కరెన్సీ మోసం భగ్నం..
ఐదుగురు నిందితుల అరెస్ట్
రూ.50 లక్షల టాయ్ కరెన్సీ స్వాధీనం
శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పోలీసులు సులభంగా డబ్బు సంపాదించాలని ఆశించిన మోసగాళ్ల ముఠా గుట్టును రట్టు చేశారు. పోలీస్ అధికారుల వేషధారణలో అమాయక ప్రజలను మోసం చేసేందుకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి భారీ మొత్తంలో టాయ్ కరెన్సీ, పోలీస్ వేషధారణ సామగ్రి, కౌంటింగ్ మెషీన్, స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. హిందూపురం టౌన్ సీఐ రాజ్ గోపాల్ నాయుడు, టౌన్ సీఐ కరీం, హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, అప్గ్రేడ్ సీఐ ఆంజనేయులు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితులు “ఒక లక్ష అసలు నోట్లు ఇస్తే రూ.10 లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తాం” అంటూ అమాయకులను వలలో వేసుకునేవారు.
భారీ మొత్తంలో డబ్బు వస్తుందనే ఆశ చూపించి, చివరికి టాయ్ కరెన్సీని అసలు నోట్లుగా నమ్మించి మోసం చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా కొందరు నిందితులు పోలీస్ అధికారుల వేషధారణలో ప్రత్యక్షమై బాధితులను భయపెట్టే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా కదలికలపై సమాచారం అందుకున్న హిందూపురం పోలీసులు అప్రమత్తమై, లేపాక్షి మండలం కొండూరు క్రాస్ వద్ద శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో దాడి నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ అయిన నిందితులు కే. వెంకటేష్ (34) చిలమత్తూరు, జి. చంద్రమోహన్ (26) అనంతపురం, నాగరాజు (60) బాగేపల్లి, కర్ణాటక, కే. బాలాజీ (33) సత్యసాయి నగర్, చిలమత్తూరు, పి. ఉపేంద్ర (23) లాలేపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.50 లక్షల ముఖ విలువ గల రూ.500 టాయ్ కరెన్సీ నోట్లు, ఒక లాఠీ, రెండు ఖాకీ ప్యాంట్లు, ఒక ఖాకీ టోపీ, హ్యాండ్ కఫ్, డబ్బులు లెక్కించే కౌంటింగ్ మెషీన్తో పాటు AP05-EA-4898 నంబర్ గల మహేంద్ర స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ అభినందించారు. ప్రజలు ఇలాంటి సులభ ధనార్జన ఆశలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
