రీపోస్ట్ నోటీస్ పై వివరణ ఇచ్చిన స్మితా
చట్టాన్ని గౌరవిస్తా.. మీరు ఏ ప్రశ్న అడిగినా జవాబిస్తా
నేను రిట్విట్ చేసిన పోస్ట్ ను మరో రెండు వేలమంది చేశారు
వారందరికీ ఎప్పుడు నోటీసులిస్తారంటూ ప్రశ్న
లేక సెలక్టడ్ గా ఉన్న వ్యక్తులనే టార్గెట్ చేస్తున్నారా అంటూ నిలదీత
గచ్చిబౌలి పోలీసులకు తాను పూర్తిగా సహకరించినట్లు చెప్పారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు తెలిపారు ఐఎఎస్ స్మితా సబర్వాల్. కాగా, తెలంగాణ రాష్ట్రంలో కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ట్విట్టర్ లో ఆమె ఒక పోస్ట్ రీట్విట్ చేయడంతో తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు.. పోలీసులు పంపిన నోటీసులపై స్మితా సబర్వాల్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో స్పందించారు.
ఆ పోస్టును తాను రీపోస్టు చేసినట్లే 2 వేల మంది షేర్ చేసినట్లు పేర్కొన్నారు. వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటారా..? చట్టం అందరికీ సమానమా.. ? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత కోరినట్లు స్మితా సబర్వాల్ తెలిపారు.
ఇది ఇలా ఉంటే కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న ‘హాయ్ హైదరాబాద్’ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన గిబ్లి తరహాలో ఉన్న ఇమేజ్ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. సేవ్ హైదరాబాద్, సేవ్ హెచ్సీయూ బయోడైవర్సిటీ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో మష్రూమ్ రాక్ ఎదుట భారీ సంఖ్యలో బుల్డోజర్లు మోహరించగా, బుల్డోజర్లకు ఎదురుగా నెమలి, జింకలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇది ఫేక్ ఫొటో అంటూ అభియోగాలు మోపారు. ఈ మేరకు బీఎన్ఎస్ 179 సెక్షన్ కింద స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు పంపారు.