రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి రూ.లక్ష సాయం

ఆలయ పనులకు మంత్రి పొన్నం సహకారం.. ఎండోమెంట్‌ నిధుల కోసం ప్రతిపాదనలు

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్‌ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి ఆలయ అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ సహకారం అందిస్తున్నారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. గతంలో రూ.50 వేలు అందించగా, మంగళవారం మరో రూ.50 వేలను కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు ముష్కె శ్రీనివాస్‌ ద్వారా ఆలయ పాలకవర్గానికి అందజేశారు.

ఆలయానికి వెళ్లే మార్గంలో విద్యుత్‌ స్తంభాల ఏర్పాటుకు ఎస్‌డీఎఫ్‌సీ నిధుల నుంచి రూ.1.35 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ఎండోమెంట్‌ కింద ఆలయ అభివృద్ధికి మరో రూ.10 లక్షల నిధుల కోసం ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌, పొన్నం అనుపు, శేఖర్‌, రాంగోపాల్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.