- పరీక్ష కేంద్రాల్లో ఫేస్ రికగ్నిషన్…
ఆంధ్రప్రభ, విజయవాడ : ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) లో ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్షలో… యుపిఎస్సి తొలిసారిగా ఫేస్ అథెంటికేషన్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ చెప్పారు.
ఆదివారం జరగనున్న సహాయక ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ & ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్/అకౌంట్ ఆఫీసర్ పరీక్ష నిర్వహణపై సంయుక్త కలెక్టర్ ఎస్.ఇలక్కియ తో కలసి స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పరీక్ష కేంద్రాల సూపర్వైజర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ… 30వ తేదీన ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు నగరంలోని 15 కేంద్రాలలో ఈపీఎఫ్ఓ పరీక్ష జరుగుతుందని చెప్పారు. నగరంలో మొత్తం 5860 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవనున్నారని తెలియజేశారు.
ఫేస్ అథెంటికేషన్ విధానం మొదటిసారిగా అమలు చేస్తున్నందున సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలని, పరీక్షా కేంద్రాలకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
దివ్యాంగ అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని, చక్రాల కుర్చీలు అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని, పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా 1300 కేంద్రాలలో జరిగే ఈ పరీక్షకు 5.4 లక్షల మంది హాజరవనున్నారని చెప్పారు.
ఈ సమావేశంలో యుపిఎస్సి ఇన్స్పెక్టింగ్ అధికారి అరుణ్ ఖురానా, డిఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీవో కే. చైతన్య, పరీక్షా కేంద్రాల సూపర్వైజర్లు, పోలీస్, విద్యుత్, పోస్టల్, వైద్య శాఖల అధికారులు పాల్గొన్నారు.

