Government | రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు

Government | రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు
Government | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. టీవీకే అధినేత విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించడంలో గవర్నర్ ఆలస్యం చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చింది.
మోదీ, అమిత్ షా ఒత్తిడి వల్లే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటును గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆలస్యం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. లోక్భవన్లో బలం నిరూపించుకోవాలని అడిగే హక్కు గవర్నర్కు లేదని స్పష్టం చేశారు. మెజార్టీ నిరూపణ అసెంబ్లీలోనే జరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తమిళనాడు గవర్నర్ వైఖరి పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ విమర్శించింది. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం మినహా గవర్నర్కు మరో మార్గం లేదని నేతలు తేల్చిచెప్పారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారగా.. కాంగ్రెస్ నిరసన పిలుపు మరింత చర్చనీయాంశంగా మారింది.
