డీజిల్లో ఇథనాల్ కలపడం కుదరదు.. ప్రయోగాలకు బ్రేక్..!
- వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : దేశంలో పెరుగుతున్న ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని ఇప్పటికే అమలు చేస్తోంది. ప్రస్తుతం 20 శాతం ఇథనాల్ కలిగిన ఈ20 పెట్రోల్ అందుబాటులో ఉంది. డీజిల్లో కూడా ఇథనాల్ను కలపాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. అయితే డీజిల్లోనూ ఇథనాల్ కలపాలన్న కేంద్రం ప్రయత్నానికి తాజాగా బ్రేక్ పడింది. డీజిల్లో ఇథనాల్ కలపడం వల్ల ఇంధన భద్రతా ప్రమాణాలు దెబ్బతింటున్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో, ఈ ప్రయోగాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.
పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తమ పరిశోధన కేంద్రాల్లో ఇథనాల్–డీజిల్ మిశ్రమంపై పలు పరీక్షలు నిర్వహించాయని తెలిపారు. వాహన తయారీ సంస్థలు, గుర్తింపు పొందిన ప్రయోగశాలల సహకారంతో జరిగిన అధ్యయనాల్లో భద్రతకు సంబంధించిన సమస్యలు గుర్తించినట్లు చెప్పారు.
రాజ్యసభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి.. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (ఓఎంసీలు) తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో ఇథనాల్-డీజిల్ మిశ్రమాలపై విస్తృతంగా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. గుర్తింపు పొందిన ప్రయోగశాలలు, వాహన తయారీ సంస్థలు, ఇతర సాంకేతిక సంస్థల సహకారంతో ఈ ప్రయోగాలు జరిగినట్లు తెలిపారు.
అయితే పరీక్షల సమయంలో ఇథనాల్ కలిపిన డీజిల్లో భద్రతకు సంబంధించిన కీలక సమస్యలు బయటపడినట్లు చెప్పారు. ముఖ్యంగా ఇంధనం మండే ఉష్ణోగ్రత అయిన ఫ్లాష్ పాయింట్ గణనీయంగా తగ్గడం ప్రధాన సమస్యగా గుర్తించినట్లు తెలిపారు. దీంతో డీజిల్లో ఇథనాల్ మిశ్రమాన్ని కొనసాగించడం సరికాదని ప్రభుత్వం నిర్ణయించింది.
డీజిల్లో ఇథనాల్ కలిపితే ఫ్లాష్ పాయింట్ ఎందుకు తగ్గుతుంది?
ఇంధన భద్రతను అంచనా వేయడంలో ఫ్లాష్ పాయింట్ కీలక ప్రమాణం. ఒక ఇంధనం నుంచి వెలువడే ఆవిరి గాలితో కలిసి.. బయట నుంచి మంట లేదా నిప్పురవ్వ తగిలినప్పుడు క్షణకాలం మండగలిగే అత్యల్ప ఉష్ణోగ్రతను ఫ్లాష్ పాయింట్ అంటారు. డీజిల్కు సాధారణంగా కనీసం 35 డిగ్రీల సెల్సియస్ ఫ్లాష్ పాయింట్ అవసరం ఉంటుంది. కానీ ఇథనాల్ ఫ్లాష్ పాయింట్ మాత్రం సుమారు 12 నుంచి 13 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉంటుంది. దీంతో ఇథనాల్ను డీజిల్లో కలిపినప్పుడు మొత్తం మిశ్రమం ఫ్లాష్ పాయింట్ తగ్గిపోతుంది. ఫ్లాష్ పాయింట్ తగ్గడం వల్ల ఇంధనాన్ని నిల్వ చేయడం, రవాణా చేయడం వంటి అంశాల్లో భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా పెట్రోల్ బంకులు, నిల్వ కేంద్రాలు, ట్యాంకర్లలో ప్రమాద అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేశారు.
ఇక్కడ మరోసమస్య కూడా ఉంది. ఇథనాల్, డీజిల్ రెండింటి రసాయన లక్షణాలు భిన్నంగా ఉంటాయి. దీంతో ఎక్కువ కాలం పాటు ఈ రెండు ఇంధనాలను కలిపి ఉంచినప్పుడు విడిపోయే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక రసాయన బైండర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే అలాంటి బైండర్లు ఖరీదైనవి కావడంతో పాటు.. వాహన ఇంజిన్ పనితీరుపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే సాంకేతికంగా, ఆర్థికంగా అనుకూల పరిస్థితులు కనిపించకపోవడంతో డీజిల్లో ఇథనాల్ మిశ్రమ ప్రయోగాలకు కేంద్రం తాత్కాలికంగా బ్రేక్ వేసింది.
పెట్రోల్లో మాత్రం కొనసాగుతున్న ఇథనాల్ మిశ్రమం..
డీజిల్లో ఇథనాల్ మిశ్రమానికి కేంద్రం బ్రేక్ వేసినప్పటికీ.. పెట్రోల్లో ఇథనాల్ కలిపిన ఇంధనాల వినియోగం కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో ఈ20 (20 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్) వంటి మిశ్రమ ఇంధనాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక శాతం ఇథనాల్ కలిగిన మిశ్రమ ఇంధనాలపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. పెట్రోల్తో పోలిస్తే డీజిల్లో ఇథనాల్ కలపడం సాంకేతికంగా మరింత క్లిష్టమైన ప్రక్రియగా మారింది. వాహన తయారీ సంస్థలు కూడా డీజిల్-ఇథనాల్ మిశ్రమాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ప్రత్యేక బైండర్లను ఉపయోగించినప్పటికీ సాధారణంగా 5 శాతానికి మించి ఇథనాల్ కలపడం పట్ల కంపెనీలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
ప్రత్యామ్నాయంగా ఐసోబ్యూటనాల్పై పరిశీలన
డీజిల్లో ఇథనాల్కు బదులుగా మరో జీవ ఇంధనం అయిన ఐసోబ్యూటనాల్ వినియోగంపై ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు దృష్టి సారిస్తున్నాయి. డీజిల్కు దగ్గరగా ఉండే లక్షణాలు కలిగిన ఐసోబ్యూటనాల్పై ప్రయోగాలు చేపట్టే అవకాశం ఉంది. 2027 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 2 శాతం ఐసోబ్యూటనాల్ కలిపిన డీజిల్పై ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించే ప్రణాళిక ఉన్నట్లు టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ విభాగం ఎండీ, సీఈవో గిరీష్ వాఘ్ తెలిపారు. ఐసోబ్యూటనాల్ ఫ్లాష్ పాయింట్ సుమారు 27 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇది డీజిల్ లక్షణాలకు కొంత దగ్గరగా ఉండేలా చేస్తుంది. ప్రాథమిక పరీక్షల్లో 10 శాతం ఐసోబ్యూటనాల్ కలిగిన మిశ్రమం 40 రోజులకు పైగా స్థిరంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే 5 శాతం ఐసోబ్యూటనాల్ మిశ్రమంతో ఉద్గారాలు తగ్గినట్లు, వాహన మైలేజీపై కేవలం 1 నుంచి 2 శాతం మాత్రమే ప్రభావం ఉన్నట్లు ప్రారంభ అధ్యయనాల్లో తేలింది.
దిగుమతి ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించే అవకాశం
ప్రస్తుతం భారత్ తన ఇంధన అవసరాల్లో గణనీయమైన భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా విదేశీ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఐసోబ్యూటనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెరిగితే.. దేశీయంగా ఉత్పత్తి చేయగల జీవ ఇంధనాలకు ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. అయితే సాధారణ డీజిల్తో పోలిస్తే ఐసోబ్యూటనాల్ శక్తి సామర్థ్యం కొంత తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ తక్కువ శాతం మిశ్రమంతో వాహన పనితీరుపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ
డీజిల్లో ఇథనాల్ మిశ్రమాన్ని నిలిపివేసిన నేపథ్యంలో పెట్రోల్లో ఇథనాల్ శాతం పెంపుపై కూడా చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఈ20 పెట్రోల్ను మించి ఇథనాల్ కలపాలనే నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో 20 శాతానికి మించి ఇథనాల్ కలపాలని భావిస్తే.. ముందుగా శాస్త్రీయ, సాంకేతిక అధ్యయనాలు నిర్వహిస్తామని తెలిపింది. ఆటోమొబైల్ కంపెనీలు, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు, పరిశోధనా సంస్థలు సహా అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.
ఈ20 పెట్రోల్పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం తదితర సంస్థలు ఈ20 ఇంధనంపై పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పరీక్షల్లో ఇంజిన్ జీవితకాలం, వాహన స్టార్టింగ్ సామర్థ్యం, డ్రైవింగ్ అనుభవం, తుప్పు ప్రభావం, వివిధ పదార్థాలతో ఇంధనం అనుకూలత, ఇంధన సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించినట్లు వెల్లడించింది. ఈ అంశాల్లో ఈ20 ఇంధనం సురక్షితంగా ఉందని కేంద్రం పేర్కొంది.
ఇప్పటికే రోడ్లపై ఉన్న పాత పెట్రోల్ వాహనాలు ఈ20 ఇంధనం వినియోగించడం వల్ల పెద్ద స్థాయిలో నష్టం ఎదుర్కొన్నట్లు నిర్ధారించే ఆధారాలు లేవని కేంద్రం తెలిపింది. ఈ15కు పైగా ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ మూడు సంవత్సరాలకు పైగా, ఈ19–ఈ20 ఇంధనం రెండున్నర సంవత్సరాలకు పైగా దేశంలో వినియోగంలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. దేశంలో ఇప్పటికే కోట్ల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, పెట్రోల్ కార్లు ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నాయని కేంద్రం పేర్కొంది. ఇథనాల్ మిశ్రమానికి ఇంజిన్ వైఫల్యాలు లేదా వాహనాల బ్రేక్డౌన్లకు ప్రత్యక్ష సంబంధం ఉందని నిరూపించే ఆధారాలు ఇప్పటివరకు లేవని స్పష్టం చేసింది.
మొత్తానికి.. డీజిల్లో ఇథనాల్ కలపాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నానికి భద్రతా కారణాలతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఫ్లాష్ పాయింట్ తగ్గడం వల్ల నిల్వ, రవాణా సమయంలో ప్రమాద అవకాశాలు పెరిగే అవకాశం ఉండటమే ప్రధాన కారణంగా మారింది. మరోవైపు, పెట్రోల్లో ఈ20 మిశ్రమం కొనసాగుతున్నప్పటికీ, భవిష్యత్తులో మరింత ఇథనాల్ను కలపాలా వద్దా అనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలపై పరిశోధనను కొనసాగించి, మరింత సురక్షితమైన మార్గాలను అన్వేషించాలని కేంద్రం ఆశిస్తోంది.
