శంషాబాద్: బి ఆర్ఎస్ నేత, హుజూరాబాద్( huzurabad) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ( Padi Koushik reddy) పోలీసులు నేడు అరెస్ట్(arrest ) చేశారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో వరంగల్ (Warangal) పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం ఆయనను వరంగల్కు తరలించారు. వివరాలు… కమలాపురం మండలం వంగపల్లి గ్రామంలో గ్రానైట్ వ్యాపారి క్వారీ యజమాని మనోజ్రెడ్డిని కౌశిక్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి గతంలో తన భర్త నుండి రూ.25 లక్షలు వసూలు చేశారని… ఏప్రిల్ 18న ఫోన్ చేసి మరో రూ.50 లక్షలు డిమాండ్ చేశారని ఉమాదేవి ఆరోపించారు.
ఉమా దేవి ఫిర్యాదు ఆధారంగా హనుమకొండ సుబేదారి పోలీసులు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద అభియోగాలు మోపారు. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కౌశిక్ రెడ్డి పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ సందర్భంగా మనోజ్ రెడ్డిని కౌశిక్ రెడ్డి బెదిరించారని ప్రాసిక్యూషన్ ఆధారాలు సమర్పించింది.
అయితే కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది మాత్రం… ప్రజల ఫిర్యాదు గురించి తెలియజేయడానికి మాత్రమే మనోజ్ రెడ్డికి తన క్లైయింట్ ఫోన్ చేశారని చెప్పారు.అయితే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ధర్మాసనం సోమవారం రోజున ఎమ్మెల్ కౌశిక్ రెడ్డి విజ్ఞప్తిని తిరస్కరించింది.
పోలీసులు అతన్ని అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును కూడా రద్దు చేసింది. అయితే ఆ వెంటనే కౌశిక్ రెడ్డి… ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై కూడా న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే కౌశిక్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. అదే సమయంలో కౌశిక్ రెడ్డి పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను జూన్ 24కు వాయిదా వేసింది. అయితే తాజాగా ఈ కేసులో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కౌశిక్రెడ్డి అరెస్టు దుర్మార్గం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై ఆయన స్పందిస్తూ.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిది అక్రమ అరెస్ట్ అని ఇది దుర్మార్గమైన చర్య అంటూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి కౌశిక్ రెడ్డి పై కక్ష కట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ తేల్చి చెప్పారు.