జపాన్ లోని ప్రవాసాంధ్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు
‘తెలుగు వెలుగు పండుగ సంబరాలు’ లలో పాల్గొన్న రేవంత్
ఐటి, ఫార్మా రంగాలలోనే ముందున్నా.. ఇప్పడు పరిశ్రమలపై దృష్టి పెట్టాం..
టోక్యో – తెలంగాణ అభివృద్ధిలో అందరి సహకారం అవసరమని, ఎవరికి చేతనైనంత వారు చేయగలిగింది చేస్తే ప్రపంచంతోనే మనం పోటీ పడొచ్చని జపాన్ లోని ప్రవాసాంధ్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నామని,అందరూ తలో చేయి వేస్తే ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన నేడు జపాన్ తెలుగు సమాఖ్య ఏర్పాటు చేసిన ‘తెలుగు వెలుగు పండుగ సంబరాలు’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ పోటీ అమరావతి , బెంగళూరు, ముంబయి, చెన్నైతో కాదని, లండన్, టోక్యో వంటి అభివృద్ధి చెందిన నగరాలతోనేనని అన్నారు.

తెలంగాణలో పెట్టుబడులు పెరగాలి, పరిశ్రమలు పెరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశమని రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మూసీ ప్రక్షాళనకూ ఆడ్డుపడుతున్నారు..
బిఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారని రేవంత్ విమర్శించారు… ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి ఉన్నదని, కేవలం కాలుష్యంతో ఢిల్లీ స్థంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన చేయాలని తాను చెబుతున్నానని, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు కాబోతున్నాయన్నారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఏమిటో మీకు తెలుసని మీ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవాలని పిలుపునిచ్చారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ పరిశీలించామని అన్నారు. నీరు, మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక అని అన్నారు
