Security | పనితీరు మారాలి..

Security | పనితీరు మారాలి..
- దుర్గగుడి ఈఓ శీనా నాయక్
- సెక్యూరిటీ సిబ్బందికి సూచనలు
Security | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో విధులు నిర్వర్తించే సెక్యూరిటీ(Security) సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించి గతంలో కంటే మెరుగ్గా పనిచేయాలని ఈవో శీనా నాయక్ ఆదేశించారు. ఈరోజు ఉదయం భక్తులతో ఎలా గౌరవంగా వ్యవహరించాలి అనే అంశంపై ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ఆలయంలోని మహామంటపం 6వ అంతస్తులో జరిగిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.
భక్తులకు రక్షణగా ఉంటూనే, వారితో మర్యాదగా ప్రవర్తించాలని ఈవో పేర్కొన్నారు. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలతో ఉన్న భక్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారికి వీలైతే కూర్చునేందుకు లేదా క్యూ లైన్లలో ఇబ్బంది లేకుండా సహకరించాలన్నారు. దర్శనం ఎటువైపు వెళ్లాలి, ప్రసాదం ఎక్కడ దొరుకుతుంది వంటి సందేహాలను విసుగు చెందకుండా ఓపికగా సమాధానం చెప్పాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు భక్తుల(devotees)ను తోయడం, గట్టిగా అరవడం చేయొద్దన్నారు. సిబ్బంది ధరించే యూనిఫాం దేవస్థానం యొక్క ప్రతిష్టకు చిహ్నం అని గుర్తుంచుకోవాలని ఈవో వివరించారు.
భక్తులే దేవుళ్లు అని, వారికి చేసే సేవ అమ్మవారికి చేసే సేవతో సమానమని, సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తన వల్ల భక్తులు ఇక్కడి నుండి వెళ్లేటప్పుడు మంచి అనుభూతిని తీసుకువెళ్లేలా అందరూ పని చేయాలని అసిస్టెంట్ కమిషనర్(Assistant Commissioner) రంగారావు పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

