ట్రాఫిక్ నిబంaధనలు పాటించండి..

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి..

  • సుర‌క్షిత ప్ర‌యాణం చేయండి
  • భీమవరంలో 3కే రన్ లో కలెక్టర్ నాగరాణి

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: యువత దేశానికి దిశా నిర్దేశమని, అదే స్థాయిలో ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి సురక్షితమైన వాహన చోదన ద్వారా విలువైన ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ రోజు బీవీ రాజు కూడలి నుంచి ఏర్పాటుచేసిన ట్రాఫిక్ పై అవగాహన 3 కే రన్ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, పెద్ద ఎత్తున కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు, అధికారులు, ప్రజలు, అథ్లెటిక్స్, వాకర్స్ అసోసియేషన్స్ పాల్గొన్నారు. త్రీ కే రన్‌ జువ్వలపాలెం రోడ్‌లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు కొనసాగింది. సుమారు ఐదు కిలోమీటర్ల పరిధిలో సాగిన త్రీ కె రన్ లో వందలాదిమంది పాల్గొన్నారు.

ట్రాఫిక్ నిబంధనలపై ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ, రహదారి భద్రత మనందరి బాధ్యత, హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్షణ, అధిక వేగం పొంచిఉన్న ప్రమాదం, ట్రిపుల్ రైడింగ్ చేయరాదు, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడపడం అత్యంత ప్రమాదం, మద్యం సేవించి వాహనం నడపరాదు అనే స్లోగన్లతో పట్టణ ప్రాంతమంతా మారుమోగింది.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఒక ప్రాణాన్ని కోల్పోతే వారి కుటుంబమే కాకుండా, ఎన్నో కుటుంబాలపై దాని ప్రభావం ఉంటుందని, ట్రాఫిక్ నిబంధనలను ప్రజలు, ముఖ్యంగా యువత తప్పనిసరిగా పాటించి సురక్షితమైన చోధన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. యువత ట్రాఫిక్ రూల్స్ పాటించడంతోపాటు, ఫిట్ ఇండియా స్ఫూర్తితో ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు.

జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ…. యువత, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా మరొకరికి ఆదర్శంగా ఉండాలని, అప్పుడే ప్రమాదాలను నియంత్రించగలమన్నారు. హెల్మెట్ ధరించకపోతే రూ.1000, అతివేగంతో వాహనాలను నడిపితే రూ.1000, ట్రిపుల్ రైడింగ్ రూ.1,500, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.1,500, మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10,000 అపరాధ రుసుం విధించడం జరుగుతుందన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జీవితంలో క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని, అలాగే ఆరోగ్యవంతమైన, సురక్షితమైన జీవనానికి దోహదపడుతుందన్నారు. మన వాహన ప్రయాణం రోడ్డుమీద నడిచేవారికి ప్రమాదకరంగా ఉండకూడదు అన్నారు. త్రీ కే రన్ ప్రారంభానికి ముందు “ఫిట్ ఇండియా” కాన్సెప్ట్ తో శారీరక దారుణ్యంపై అవగాహన కల్పించేందుకు విష్ణు కాలేజీ విద్యార్థులు లఘు ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకున్నది.

ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, డీఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, భీమవరం ఆర్టీవో కే.ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ డాక్టర్ శ్రీ వేద, జిల్లా రవాణా అధికారి కృష్ణారావు, మున్సిపల్ కమిషనర్ కే.రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఏ.రాంబాబు, డీపీఓ ఎం. రామ్నాథ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ విజయ్, డీఈవో ఇ.నారాయణ, డీఎస్డీవో దాసు, ఎల్డీ ఎం ఏ.నాగేంద్ర ప్రసాద్, ఎంహెచ్ఓ సోమశేఖర్, రెడ్ క్రాస్ ప్రతినిధి గోపిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply