TDP | చంద్రబాబూ.. గంగిరెద్దులా తలూపొద్దు..!
– కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతుల్ని ఆదుకోండి
– మీ కేసులపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదా?
– అచ్చెన్నా.. శవరాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు
– అన్నదాతలను శవాలుగా చేస్తోంది మీరు కాదా?
– ఏ పంటకైనా గిట్టుబాటు ధర కల్పిస్తున్నారా?
– వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం
TDP | అనంతపురం బ్యూరో, ఆంధ్ర ప్రభ : రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కేంద్రంతో పోరాడాల్సిన చంద్రబాబు.. ఇక్కడి ప్రజలు, రైతులను పణంగా పెట్టి తన పాత కేసులను మాఫీ చేసుకుంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. కేంద్రంలో ఈ రోజు ఎన్డీయే ప్రభుత్వం ఉందంటే అది ఇక్కడి ఎంపీల వల్లేనని గుర్తు చేశారు. ఒక్క వార్నింగ్ ఇస్తే కేంద్రం దిగి వస్తుందని, కానీ చంద్రబాబు మాత్రం తన స్వప్రయోజనాల కోసం కేంద్రం వద్ద గంగిరెద్దులా తలూపుతున్నారని మండిపడ్డారు. 15 రోజులకు ఒకసారి వెళ్లి మోదీ కాళ్లు పట్టుకుని తన కేసులను మాఫీ చేసుకోవడానికి మాత్రమే సమయం వెచ్చిస్తున్నారని తెలిపారు.
వైసీపీ జిల్లా కార్యాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. పుట్లూరు మండలం ఎల్లుట్లలో అరటి రైతు నాగలింగం ఆత్మహత్య ఘటనను వైసీపీ శవరాజకీయాల కోసం వాడుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను అనంత వెంకటరామిరెడ్డి ఖండించారు. బాధిత కుటుంబానికి ఆత్మస్థైర్యం ఇవ్వడంతో పాటు రైతాంగానికి తోడుగా ఉంటామని చెప్పడం కోసమే తాము ఎల్లుట్లకు వెళ్లామన్నారు. రైతులను ఆదుకోవాలని కోరితే శవ రాజకీయాలు చేస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థ విధానాల వల్లే రైతులు శవాలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చట్టానికి విరుద్ధంగా రైతు నాగలింగం మృతదేహానికి తెల్లవారుజామునే పోస్టుమార్టం చేసి గ్రామానికి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కనీసం బంధుమిత్రులందరూ వచ్చే అవకాశం కూడా లేకుండా పోలీస్ బందోబస్తు మధ్య అంత్యక్రియలు పూర్తి చేయించారని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల వల్ల ఈ రోజు రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదన్నారు. అన్నదాతల దయనీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
రైతు వద్ద పంటలకు మద్దతు ధరలు లేవని, కానీ మార్కెట్లో వినియోగదారులు మాత్రం అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం, దళారులు కలిసిపోవడం వల్లే దురాగతాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, నారా లోకేష్లు ఢిల్లీ వెళ్లి గిట్టుబాటు ధరల కోసం పోరాడాలని.. ప్రధాని మోదీని డిమాండ్ చేయాలని సూచించారు. రైతుల ఎవరూ నిరాశ చెందొద్దని.. అన్ని రాజకీయాల పార్టీలు, సమాజం మీకు అండగా నిలబడుతుందని చెప్పారు. చావు పరిష్కారం కాదని, దాని వల్ల మీ కుటుంబాలను మరిన్ని కష్టాల్లో నెట్టివేసినట్లు అవుతుందన్నారు.

