AP | సైబర్ నేరాల నివారణకు.. సైబర్ స్మార్ట్.. మంత్రి టీజీ భరత్

కర్నూలు బ్యూరో : అవగాహనతోనే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండగలమని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అవగాహన ఏర్పరచుకొని, వాటి బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ఏపీ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇటీవల సమాజంలో పెరిగిపోతున్న సైబర్ నేరాల నివారణకు ఈరోజు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో కర్నూలు ఆర్ఎస్ రోడ్డులోని స్థానిక కేవీఆర్ కళాశాలలో విద్యార్థినీలకు సైబర్ స్మార్ట్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

వివిధ రకాల సైబర్ నేరాలు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన సైబర్ నేరాల లఘు చిత్రాలను ప్రోజెక్టర్ ద్వారా ప్రదర్శించి, సదస్సుకు హాజరైన విద్యార్థినీలకు అవగాహన కల్పించారు. మంత్రి టీజీ భరత్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సైబర్ నేరాల పోస్టర్లను, వీడియోలను ఆవిష్కరించారు. సైబర్ నేరాల అవగాహన పోస్టర్లను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా ప్రజలకు చేర్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.

ఈసందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ… సైబర్ నేరాల బారిన పడకుండా ముఖ్యంగా మహిళలు, యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. కస్టమ్స్ అధికారులమని, పోలీసు, బ్యాంకు అధికారులమని నిజంగా, స్వయంగా మాట్లాడినట్లు మోసాలకు పాల్పడతున్నారన్నారు. ఫేక్ కాల్స్ అయినప్పటికీ అది నిజమని నమ్మి మోసపోతున్నారన్నారు. బ్యాంకు ఖాతాలను హ్యక్ చేయడానికి సైబర్ నేరగాళ్ళు ప్రయత్నిస్తుంటారని, స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ ఉంచుకోవాలన్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, వంటి సోషల్ మీడియాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. నిజమైన ఫోటోలు, ఫేక్ ఫోటోలు గుర్తుపట్టలేనంతగా మార్ఫింగ్ చేసి మోసాలు చేస్తున్నారన్నారు. విద్యార్థినులు చదువుపై శ్రధ్ద వహించాలన్నారు. పోటీతత్వం ఎక్కువగా ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో ప్రతిఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండి, సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ… ఇటీవల కాలంలో ప్రస్తుత సమాజంలో స్మార్ట్ ఫోన్లు ఎక్కువవుతున్నాయని, టెక్నాలజీ పెరగడంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు. డిజిటల్ అరెస్టు, జాబ్ ఫ్రాడ్స్, కేవైసీ, ఓటీపీ మోసాలు, పెట్టుబడి మోసాలు, కోరియర్ ఫ్రాడ్స్, ఆధార్ కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందని, లింకు వస్తుంది క్లిక్ చేయాలని, జాబ్ ఇస్తామని చెప్పి అనేక రకాలుగా మోసాలు చేస్తున్నారన్నారు. డిజిటల్ అరెస్టు, కెవైసి – ఓటిపి ప్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్ , ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్స్ వంటి లఘు చిత్రాల ద్వారా జిల్లా వ్యాప్తంగా రేపటి నుండి విద్యా సంస్ధలు, పాఠశాలలు, కళాశాలలు, పట్టణాలు, గ్రామాల్లో సైబర్ నేరాల బారిన పడకుండా సైబర్ నేరాల గురించి ప్రజలకు, విద్యార్దులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేసి సమాచారం అందించి ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫిర్యాదు చేస్తే తప్పక న్యాయం జరుగుతుందన్నారు. సైబర్ క్రైమ్ పోర్టల్ సైబర్ క్రైమ్ గవర్నమెంట్ ఇన్లో బాధితులు వివరాలు నమోదు చేయాలన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ పోలీసు అధికారులను సంప్రదించి సైబర్ నేరం జరిగిన వివరాలను తెలియజేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు కేవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ వీవీ సుబ్రమణ్య కుమార్, క్లస్టర్ యూనివర్సీటి వైస్ చాన్సలర్ డీవీఆర్ సాయి గోపాల్ , క్లస్టర్ యూనివర్సీటి రిజిస్ట్రార్ కట్టా వెంకటేశ్వర్లు, కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి.హుస్సేన్ పీరా, కర్నూలు డీఎస్పీ జె.బాబు ప్రసాద్, కర్నూలు పట్టణ పోలీసు అధికారులు, సైబర్ ల్యాబ్ సిబ్బంది, కేవీఆర్ కళాశాల విద్యార్దినీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *