అసెంబ్లీలో సీఎం రేవంత్
ఆ రెండు చట్టాలు తెచ్చింది గత ప్రభుత్వమే!
హైదరాబాద్, ఆంధ్రప్రభ : గత ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు చట్టాలు గుదిబండగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఆయన మాటల్లో… 2018లో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని ఉంది. 2019లో తెచ్చిన మున్సిపల్ చట్టంలోనూ ఇదే ఉంది. ఈ రెండు చట్టాలు గుదిబండగా మారడంతో మా ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం రెండు బిల్లులను గతంలో తాము అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కు పంపినట్లు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారన్నారు. సుమారు ఐదు నెలల నుంచి ఆ బిల్లులు రాష్ట్రపతి వద్ద ఉన్నాయని చెప్పారు.
ఐదుసార్ల ప్రధానికి లేఖ రాశాం…
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదని చెబుతున్నారుని, ఐదు సార్లు దీని గురించి ప్రధానికి లేఖ రాశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఈక్రమంలో ప్రధానిపై ఒత్తిడి తీసుకురావడానికి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశామని గుర్తు చేశారు. వంద మంది ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మద్దతిచ్చారని, రాజ్యసభలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఎంపీలు మాత్రం అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదని అన్నారు. బీసీల గురించి మాట్లాడుతున్న గంగుల కమలాకర్ కూడా రాలేదన్నారు. వాళ్ల పార్టీ నాయకుడు బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరని ఆరోపించారు. ఈరోజు కూడా సభలో గందరగోళం సృష్టించి బిల్లు ఆమోదం చెందకుండా ప్రయత్నిస్తున్నారని అన్నారు.
బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం
ఆరునూరైనా రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు సోనియాగాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పారు. రాహుల్ గాంధీకి తెలియకుండా తాను నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్లకు రాష్ట్రంలో డెడికేటెడ్ కమిషన్ ను వేశామని చెప్పారు. బలహీన వర్గాలకు న్యాయం చేయాలని తాము ప్రయత్నిస్తోంటే బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ కు పంపిస్తే.. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందని చెప్పారు.
అసెంబ్లీలో మంత్రుల మాటలు…
ఎవరో కోర్టుకు వెళితే సీఎంకు అంటగట్టడం కరెక్టు కాదు : మంత్రి సీతక్క
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతానికి కుదిస్తూ 2018 పంచాయతీరాజ్ చట్టం (Panchayat Raj Act) తెచ్చిందని, బీసీ రిజర్వేషన్లను రేవంత్ రెడ్డి (Revanth Reddy) బంధువు అడ్డుకుంటున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) (Minister Dhanasari Anasuya Sitakka)అన్నారు. బీసీ బిల్లుపై సీతక్క మాట్లాడారు. ఎవరో కోర్టు కి వెళితే సీఎం కు అంటగట్టడం కరెక్టు కాదన్నారు. బీసీ రిజర్వేషన్ల (BC reservation)ను కుదించింది బీఆర్ఎస్ ప్రభుత్వమ న్నారు. ముస్లిం లకు 12 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బీఆర్ఎస్ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తమిళనాడులో ఎన్నో పోరాటాలు చేస్తే బీసీ రిజర్వేషన్ల పెంపునకు పది సంవత్సరాలు పట్టిందన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలంతా బిల్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు.
ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలి : మంత్రి పొన్నం
బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి హౌజ్ లో డిఫెరెంట్ ఆఫ్ ఒపినియన్ రాకుండా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాలని, కోర్టులు కోడ్ ఆఫ్ హౌజ్ పరిగణన లోకి తీసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)అన్నారు. మీరు (బీఆర్ ఎస్) పదేళ్లు అధికారం లో ఉండి బీసీ లకు, ఎంబీసీలకు ఏం చేశారని ప్రశ్నించారు. తామేమో తరువాత చర్చిద్దామని, మేనిఫెస్టో లు ఇతర అంశాలు చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. బలహీన వర్గాలకు న్యాయం చేయాలని అడుగుతున్నామని, అధ్యక్ష పదవి , కార్యనిర్వహక అధ్యక్ష పదవి, ప్రతిపక్ష నాయక పదవి మీ దగ్గరే ఉన్నాయని అన్నారు. ఇబ్బందులు ఉంటే సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఇది సామాజిక న్యాయానికి సంబంధించిన చరిత్రాత్మక నిర్ణయంమని అన్నారు. బీజేపీ శాసన సభ పక్షం కూడా బీసీ లకు ఇవ్వలేకపోయారని, దేశ వ్యాప్తంగా ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే రాష్ట్రం లో వచ్చిన ఐదు ఎమ్మెల్సీలు బలహీన వర్గాలకు వచ్చాయని చెప్పారు. ఈ సమయం లో బీజేపీ పార్టీ అధ్యక్షుడునీ కూడా బీసీ లకు ఇవ్వలేకపోయారన్నారు. బీసీలకు న్యాయం చేయడానికి మద్దతు ఇవ్వాలని కోరారు.