ఉగ్ర క‌ల‌క‌లం..

(ఆంధ్రప్రభ, శ్రీ సత్యసాయి బ్యూరో) : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టనంలో జిహాదీ లింకులు కేసులో నిందితుడు నూర్ మహమ్మద్‌కు కోర్టు 14 రోజుల న్యాయస్థాన రిమాండ్ విధించింది. ఆదివారం పోలీసులు నూర్ మహమ్మద్‌ను కదిరి కోర్టులో హాజరుపరచగా, ఆగస్టు 29 వరకు రిమాండ్‌లో ఉంచాలని జడ్జి ఆదేశించారు. అనంతరం భద్రతా ఏర్పాట్ల మధ్య కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

వాట్సప్ గ్రూపుల్లో జిహాదీ ప్రాచారం…

నూర్ మహమ్మద్ సుమారు 37 వాట్సప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉండి, వాటిలో ఆల్ ఖైదా, లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిద్దీన్, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల ప్రొపగాండా వీడియోలు, జిహాదీ భావజాలాన్ని పంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. స్థానికంగా బిర్యానీ సెంటర్‌లో పనిచేస్తూ, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండటం సంచలనం రేపింది.

పోలీసుల దర్యాప్తులో, భార్యతో విభేదాల కారణంగా వేరుగా ఉంటూ, తాడిపత్రికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నట్టు బయటపడింది. పాకిస్థాన్‌ తీవ్రవాద సంస్థలతో ఆ మహిళకు కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో ప్రశ్నించారు. ఇటీవల ధర్మవరంలో నిర్మించిన పెద్ద ఇంటి నిర్మాణం కూడా నిధుల మూలంపై అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ ఆర్థిక సహాయం ఎక్కడి నుండి వచ్చిందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.

నూర్ మహ్మద్ తల్లిదండ్రులు తమ కొడుకు మంచివాడని, పోలీసులు అతన్ని ఎందుకు తీసుకెళ్లారో తెలియదని చెబుతున్నారు. తమ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో పోలీసులకు ఏమీ దొరకలేదని వివరించారు. తదుపరి దర్యాప్తు కోసం నూర్ మహ్మద్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపే అవకాశం ఉంది.

ఇక‌, ఇదే కేసులో ఎర్రగుంటకు చెందిన రియాజ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను వాట్సప్ స్టేటస్‌లో పాక్ జెండా, పాక్ జిందాబాద్ నినాదాలు, సయ్యద్ బిలాల్ వీడియోలు పెట్టడంతో మరింత అనుమానం వ్యక్తమైంది.

జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలను ఏమాత్రం సహించమని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వీ. రత్న స్పష్టం చేశారు. రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సమాచారంతో ధర్మవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నూర్ మహమ్మద్ ఇంటిని తనిఖీ చేసి, మొబైల్ ఫోన్‌తో పాటు జిహాదీ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిపై దేశద్రోహం సహా UAPA చట్టం (1967) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక రాగానే, అతని ఉగ్రవాద సంబంధాలపై పూర్తి వివరాలు బయటపడనున్నట్లు ఎస్పీ తెలిపారు.

Leave a Reply