Telangana | బీసీ సంఘాలు బీజేపీ నిజ‌స్వ‌రూపం తెలుసుకోండి – మంత్రి పొన్నం

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : రిజ‌ర్వేష‌న్ విష‌యంలో బీసీ సంఘాలు బీజేపీ నిజ‌స్వ‌రూపం తెలుసుకోవాల‌ని రాష్ట్ర ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం ఇక్క‌డ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్య‌ల‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిప‌డ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ 9వ షెడ్యూల్‌లో చేర్చడం అసాధ్యం అంటున్నారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమే.. గతంలో పక్క రాష్ట్రం తమిళనాడులో జరిగిందని ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఎందుకు రిజర్వేషన్లు అమలు కావో చూస్తామ‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి రెడ్డి, డిప్యూటీ సీఎం ఎస్సీ, పీసీసీ అధ్య‌క్షుడు బీసీల‌కు చెందిన వారు ఉన్నార‌ని చెప్పారు.

సుప్రీంకోర్టు స్ప‌ష్టంగా చెప్పింద‌ని…
సుప్రీంకోర్టులో ఇందిరా సహనీ కేసులో స్పష్టంగా చెప్పింద‌ని, రాష్ట్రాల దగ్గర ప్రామాణికమైన సమాచారం ఉంటే.. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింద‌ని పొన్నం గుర్తు చేశారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి కేబినెట్ ఆమోదం, శాసనసభ ఆమోదం, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంద‌న్నారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం అని అన్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంద‌న్నారు. తెలంగాణలోని అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజస్వరూపాన్ని గమనించి రిజ‌ర్వేషన్లు ప్రక్రియను కాపాడుకునే దానిలో ముందుండాలని కోరారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తప్పకుండా 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సిందే అని డిమాండ్ చేశారు.

Leave a Reply