గుంటూరు – టిడిపి కేంద్ర కార్యాలయంలో ఎంపీలు (MPs), ఎమ్మెల్యేలు (MLAs), ఎమ్మెల్సీలతో (MLCs) నేడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక సమావేశం (Key Meeting) నిర్వహించనున్నారు. జులై 2వ (July 2nd) తేదీ నుంచి ప్రజల్లోకి కూటమి నేతలు (Kutami Leaders) వెళ్లేలా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలు రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాలను ప్రజలకు కూటమి నేతలు (Alliance Leaders ) వివరించనున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
విస్తృత స్థాయి సమావేశం…
ఇక నేటి ఉదయం 11 గంటలకి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు అందరూ హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జులై 2వ తేదీ నుంచి కూటమి నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ఇప్పటికే చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సుమారు నెల రోజుల పాటు నేతల ప్రచారం కొనసాగనుంది. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రచారం చేయనున్నారు.
నివేదికలు తెప్పించుకున్న చంద్రబాబు..
కాగా గత ప్రభుత్వ హయాంలో ఇసుక, మద్యం, గనులు విపరీతంగా దోపిడీకి, అడ్డగోలు అక్రమాలకు గురయ్యాయి. దీంతో వీటి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని వాటి జోలికి పోవద్దని అధికారులు, టీడీపీ ఎమ్మెల్యేలను అధినేత చంద్రబాబు హెచ్చరిస్తూనే ఉన్నారు. మహానాడు వేదికగా బహిరంగంగానే వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు చాలా వరకు దారికి వచ్చినా, కొందరు మాత్రం కట్టు తప్పుతున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. దీంతో ఇలాంటివారిని గుర్తించి ‘సరిచేయడానికి’ ఆదివారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నివేదికలు తెప్పించుకున్నారు.
నేతలకు దిశా నిర్దేశం..
దారి తప్పిన అలాంటి ఎమ్మెల్యేలను, నేతలను గాడిలో పెట్టేందుకు, కొరడా ఝళిపించేందుకు సిఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ఆదివారం సమావేశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ‘క్లాస్’ తీసుకోనున్నారు. అంతేకాదు.. తీవ్రస్థాయి ఆరోపణలు ఉన్నవారిని ప్రత్యేకంగా పిలిచి 1-1 చర్చించనున్నారు. పద్ధతి మార్చుకోవాలని, ప్రజలకు చేరువ కావాలని హెచ్చరించడంతోపాటు గట్టి వార్నింగే ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏడాది పాలన పూర్తిచేసుకున్న దరిమిలా.. ప్రజల్లో సానుకూల దృక్ఫథం పెంచే విధానాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.