కడప : కడప జిల్లాలో ఎలక్ట్రిక్ స్కూటీ (Electric Scooty) పేలి వృద్ధురాలి మరణానికి దారితీసింది. యర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఛార్జింగ్ అవుతుండగా వాహనం అకస్మాత్తుగా పేలడంతో,..పక్కనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ (62) (Venkata Lakshmamma) మంటల ధాటికి ప్రాణాలు కోల్పోయారు. వెంకట లక్ష్మమ్మ ఇంటి ప్రాంగణంలో తన కుటుంబం కోసం కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ స్కూటీ రాత్రి ఛార్జింగ్ కోసం ఉంచారు. అయితే.. ప్రమాదకరంగా వాహనం పేలడంతో సమీపంలో ఉన్న ఆమెకు మంటలు వ్యాపించాయి.
ఈ సంఘటన ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై ఆందోళనలకు దారితీసింది. వీటిని సరైన స్థితిలో ఉపయోగించకపోతే ప్రమాదకరంగా మారే అవకాశముందనే విషయం మరోసారి స్పష్టమైంది. ఛార్జింగ్ (charging) కు ఉపయోగించిన ప్లగ్పాయింట్, వాహనంలో ఏదైనా లోపం ఉన్నదా అనేది అధికారులు పరిశీలిస్తున్నారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. వాహనం పేలుడుకు గల కారణాలను అన్వేషించేందుకు ఫోరెన్సిక్ టీం (Forensic team) ను రప్పించారు. వాహనం తయారీ సంస్థకు కూడా సమాచారం పంపినట్లు తెలిపారు. విధ్వంసకర ఘటనలు జరగకుండా ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచడం అత్యంత అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.