Axiom-4 | భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం – స్పేస్ స్టేషన్ లో మన శుభాంశు శుక్లా

నాసా | : భారత అంతరిక్ష చరిత్రలో ( indian space history) మరో కొత్త అధ్యాయం మొదలైంది. విశ్వవినువీధుల్లో దేశ కీర్తిపతాక రెపరెపలాడే మధురఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లమంది భారతీయుల ఆకాంక్షలు, శుభాశీస్సులను గుండెల నిండా నింపుకొని మన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసిలోకి పయనమయ్యారు.

ఆయనతో కలిసి మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం-4 (Axiom-4) నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌లో (NASA) బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) చేపట్టిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ప్రయోగం (Falcon Rocket) విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. కొద్ది క్షణాల తర్వాత రాకెట్‌ నుంచి వీరి క్యాప్సుల్‌ విడిపోయి ఐఎస్‌ఎస్‌ దిశగా ప్రయాణం కొనసాగించింది.

వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదాపడుతూ వస్తోంది. నేడు కూడా ఈ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు సమస్య తలెత్తగా.. శాస్త్రవేత్తలు దాన్ని సరిచేయడంతో అంతా సవ్యంగా జరిగింది.

ఐఎస్‌ఎస్‌లో ‘శుక్స్‌’గా..

అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్‌’ ఈ మిషన్‌ను చేపట్టింది. భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహించాయి.

శుభాంశు శుక్లాతో పాటు మిషన్‌ కమాండర్‌ పెగ్గీ విట్సన్‌ (అమెరికా), స్పెషలిస్టులు టిబర్‌ కపు (హంగరీ), స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ- విస్నియెస్కీ (పోలండ్‌) రోదసిలోకి వెళ్లారు. ఈ ప్రయోగంలో శుభాంశు మిషన్‌ పైలట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అంతరిక్షంలో ఆయనను ‘శుక్స్‌’గా పిలవనున్నారు.వీరు 28 గంటల ప్రయాణం తర్వాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) చేరుకుంటారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) వీరి వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం అవుతుంది. ఐఎస్‌ఎస్‌లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉంటుంది.

భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో అక్కడినుంచి ముచ్చటిస్తారు.ఇస్రో తరఫున ఏడు ప్రయోగాలు..ఈ ప్రయాణం ద్వారా శుభాంశు గడించే అనుభవం.. 2027లో చేపట్టే స్వీయ మానవసహిత యాత్ర గగన్‌యాన్‌కు ఉపయోగపడుతుందని ఇస్రో చెబుతోంది.

ఐఎస్‌ఎస్‌లో శుభాంశు.. ఇస్రో తరఫున ఏడు ప్రయోగాలు నిర్వహిస్తారు. దీర్ఘకాల రోదసి యాత్రల సమయంలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా ఇందులో ఉంది. భారరహిత స్థితి వల్ల ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని శోధిస్తారు. నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు పాల్గొంటారు.

మొత్తం మీద యాక్సియం-4 వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తారు. తద్వారా ఐఎస్‌ఎస్‌లో ఒకే మిషన్‌లో అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు చేపట్టినట్లవుతుంది.41 ఏళ్ల తర్వాత..ఈ ప్రయోగంతో 41 ఏళ్ల తర్వాత మన వ్యోమగామి ఒకరు రోదసిలో.. భారరహిత స్థితిలో తేలియాడబోతున్నారు.

అంతకుముందు 1984లో సోవియట్‌ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్‌ కార్యక్రమం కింద సోయుజ్‌ టి-11 వ్యోమనౌకలో రాకేశ్‌శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత భారత పౌరుడొకరు రోదసియానం చేయడం మళ్లీ ఇప్పుడే.

Leave a Reply