అమరావతి : గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ (Vijay Rupani) (68) నిన్న అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్ రూపానీ ఆకస్మిక మరణం పట్ల ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు.రూపానీ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గుజరాత్ రాష్ట్రానికి, భారత రాజకీయ రంగానికి విజయ్ రూపానీ చేసిన సేవలను పవన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు జనసేనాని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.
అహ్మదాబాద్ (Ahmedabad) లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఇతర ప్రయాణీకులతో పాటు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా చనిపోవడం విషాదాకరం. ఆయన మృతికి నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ విషాదకరమైన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బీజేపీ కార్యకర్తలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని పవన్ ట్వీట్ చేశారు.
కాగా, అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ (London) కు బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేఘాని నగర్ సమీపంలోని నివాస ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న విజయ్ రూపానీతో సహా మొత్తం 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలను, ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
విజయ్ రూపానీ తన భార్య, కుమార్తెను కలిసేందుకు లండన్ వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. వాస్తవానికి, బీజేపీ పంజాబ్ ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున, అలాగే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి రావడంతో ఆయన లండన్ ప్రయాణాన్ని గతంలో వాయిదా వేసుకున్నారు. ఆయన 2016 ఆగస్టు నుంచి 2021 సెప్టెంబర్ వరకు గుజరాత్ 16వ ముఖ్యమంత్రిగా సేవలందించారు. విమాన ప్రమాదం (plane crash) లో మరణించిన రెండో గుజరాత్ ముఖ్యమంత్రిగా రూపానీ నిలిచారు. గతంలో 1965లో బల్వంతరాయ్ మెహతా కూడా విమాన ప్రమాదంలోనే కన్నుమూశారు.