Uss-George-Washington-Replaces-Abraham-Lincoln-Middle-East-Deployment | అబ్రహాం లింకన్ స్థానంలో జార్జ్ వాషింగ్టన్
Uss-George-Washington-Replaces-Abraham-Lincoln-Middle-East-Deployment | అబ్రహాం లింకన్ స్థానంలో జార్జ్ వాషింగ్టన్
ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధిలో నౌకాదళ కార్యకలాపాల నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 260 రోజులకు పైగా సముద్రంలో విధులు నిర్వహిస్తున్న USS అబ్రహాం లింకన్ విమాన వాహక నౌక స్థానంలోకి USS జార్జ్ వాషింగ్టన్ను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. సుదీర్ఘ మోహరింపు కారణంగా అబ్రహాం లింకన్ సిబ్బంది ఎదుర్కొంటున్న ఆహార సరఫరాలు, మౌలిక సదుపాయాలు, మానసిక ఒత్తిడి వంటి అంశాలపై చర్చ జరుగుతున్న వేళ ఈ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. అణుశక్తితో నడిచే జార్జ్ వాషింగ్టన్ రాకతో హోర్ముజ్ జలసంధిలో అమెరికా నౌకాదళ ఉనికి మరింత బలపడనుంది. ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు, గల్ఫ్ ప్రాంత భద్రత, ప్రపంచ చమురు రవాణాపై ఈ పరిణామాల ప్రభావాన్ని ఈ కథనం విశ్లేషిస్తుంది.
- మధ్యప్రాచ్యానికి మరో విమాన వాహక నౌక
- అమెరికా సైనిక మోహరింపుల్లో కీలక మార్పు
- 260 రోజులకు పైగా సముద్రంలో ఉన్న ‘అబ్రహాం లింకన్’
- హోర్ముజ్ జలసంధిలో నౌకాదళ కార్యకలాపాలు
Uss-George-Washington-Replaces-Abraham-Lincoln-Middle-East-Deployment |ఆంధ్రప్రభ వెబ్, అంతర్జాతీయ ప్రతినిధి : ఇరాన్తో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధిలో అమెరికా నౌకాదళ కార్యకలాపాల నేపథ్యంలో అమెరికా మరో కీలక విమాన వాహక నౌకను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. దీర్ఘకాలంగా సముద్రంలోనే విధులు నిర్వహిస్తున్నఅమెరికా అబ్రహ్మం లింకన్ (సీవీఎన్-71) స్థానంలో యూఎస్ జార్జి వాషింగ్టన్ (సీవీఎన్-73) ను పంపుతోంది. ఈ పరిణామం రొటేషన్గా కనిపిస్తున్నప్పటికీ.. అబ్రహాం లింకన్ సిబ్బంది ఎదుర్కొంటున్న ఒత్తిడి, సరఫరాల సమస్యలు, నౌకలోని మౌలిక సదుపాయాలపై వస్తున్న ఆరోపణలు నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం పెరిగింది.
260 రోజులకు పైగా సముద్రంలోనే..
అబ్రహాం లింకన్ సిబ్బంది 2025 నవంబర్లో అమెరికాలోని శాన్ డియాగో నుంచి బయలుదేరింది. తొలుత ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మోహరించాల్సిన ఈ నౌకను ఇరాన్ చుట్టూ ఉద్రిక్తతలు పెరగడంతో మధ్యప్రాచ్యం వైపు మళ్లించారు. జనవరిలో ఇది అమెరికా 5వ నౌకాదళ పరిధిలోకి ప్రవేశించింది.
ఆ తర్వాత హోర్ముజ్, గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక కార్యకలాపాలకు ఇది కీలక వేదికగా మారింది. తాజా నివేదికల ప్రకారం లింకన్ దాదాపు 266 రోజులుగా మోహరింపులో ఉంది. ఇది ఆధునిక అమెరికా విమాన వాహక నౌకలకు అత్యంత సుదీర్ఘమైన నిరంతర సముద్ర మోహరింపుల్లో ఒకటిగా నిలిచింది.
ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధిలో నౌకాదళ కార్యకలాపాల నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 260 రోజులకు పైగా సముద్రంలో విధులు నిర్వహిస్తున్న USS అబ్రహాం లింకన్ విమాన వాహక నౌక స్థానంలోకి USS జార్జ్ వాషింగ్టన్ను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది.
అణుశక్తితో నడిచే జార్జ్ వాషింగ్టన్ రాకతో హోర్ముజ్ జలసంధిలో అమెరికా నౌకాదళ ఉనికి మరింత బలపడనుంది.
అసలు సమస్య ఇదే..
లింకన్లో పనిచేస్తున్న సిబ్బంది కుటుంబ సభ్యులు, కొందరు మాజీ నేవీ అధికారులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వారి ఆరోపణల ప్రకారం.. ఆహార సరఫరాల్లో కొరత ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో ఆహారాన్ని పరిమితంగా వినియోగించాల్సి వచ్చింది. సబ్బు, టూత్పేస్ట్ వంటి ప్రాథమిక వస్తువులు అందుబాటులో లేకపోయిన సందర్భాలున్నాయి. కొన్ని షవర్లు, టాయిలెట్లు, ప్లంబింగ్ వ్యవస్థల్లో సమస్యలు ఏర్పడ్డాయి. సుదీర్ఘకాలం సముద్రంలో ఉండటం వల్ల సిబ్బందిపై మానసిక ఒత్తిడి పెరిగింది. నౌకకు తగినంత విశ్రాంతి, పోర్ట్ సందర్శనల అవకాశాలు లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసిందని కుటుంబాలు చెబుతున్నాయి.
కొన్ని కుటుంబాల ఆరోపణల్లో సిబ్బందిలో కొందరు నౌక నుంచి సముద్రంలోకి దూకేందుకు ప్రయత్నించారన్న విషయాలు కూడా తెరపైకి వచ్చాయి. దీనిపై అమెరికా చట్టసభ్యులు రక్షణ శాఖను వివరణ కోరుతున్నారు. అయితే ఈ ఆరోపణలలు అమెరికా రక్షణ శాఖ నిర్ధారించలేదు.
ఆహార కొరతపై మరో వాదన
2026 ఏప్రిల్లో కూడా లింకన్, USS Tripoli నౌకల్లో ఆహారం తక్కువగా ఉందంటూ ఫొటోలు, సిబ్బంది కుటుంబాల వాంగ్మూలాలు వెలువడ్డాయి. కొన్ని చిత్రాల్లో చాలా తక్కువ పరిమాణంలో ఆహారం కనిపించింది. అయితే అమెరికా నేవీ ఈ ఆరోపణలను ఖండించింది. సిబ్బందికి పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా ఆహారం అందుతోందని, నౌకల్లో తగినంత ఆహార నిల్వలు ఉన్నాయని అధికారులు అప్పట్లో చెప్పారు. నేవీ విడుదల చేసిన ఫొటోల్లో పూర్తి స్థాయి భోజనాలు చూపిస్తూ కొరత ఆరోపణలను తిరస్కరించింది. అంటే.. సిబ్బంది కుటుంబాల ఆరోపణలు ఒక వైపు, అమెరికా నేవీ అధికారిక ఖండన మరోవైపు ఉన్నాయి.
‘జార్జ్ వాషింగ్టన్’ ఎందుకు వస్తోంది?
లింకన్ స్థానంలోకి వస్తున్న USS George Washington అణుశక్తితో నడిచే విమాన వాహక నౌక. ఇది అమెరికా నేవీ Carrier Strike Group 5లో ప్రధాన నౌక. ఇందులో విమాన దళంతో పాటు ఇతర యుద్ధ నౌకలు కూడా ఉంటాయి. తాజా ఆదేశాల మేరకు జార్జ్ వాషింగ్టన్ ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుంచి మధ్యప్రాచ్యం వైపు కదులుతోంది. దీంతో అమెరికా తన ఇండో-పసిఫిక్ మోహరింపును కొంత తగ్గించి, ఇరాన్–హోర్ముజ్ సంక్షోభానికి నౌకాదళ ప్రాధాన్యత పెంచుతున్నట్లు కనిపిస్తోంది.
ఆసియాపై ప్రభావం?
ఇక్కడే మరో వ్యూహాత్మక అంశం ఉంది. జార్జ్ వాషింగ్టన్ జపాన్ కేంద్రంగా అమెరికా ఇండో-పసిఫిక్ నౌకాదళానికి కీలకమైన విమాన వాహక నౌక. దానిని మధ్యప్రాచ్యానికి తరలించడం వల్ల ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా విమాన వాహక నౌకల ప్రత్యక్ష ఉనికి తాత్కాలికంగా తగ్గే అవకాశం ఉంది.
చైనా ఇప్పటికే పశ్చిమ పసిఫిక్, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో తన నౌకాదళ కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం జపాన్, ఫిలిప్పీన్స్ వంటి అమెరికా మిత్రదేశాల్లో ఆందోళనకు కారణమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రంప్ స్పందన ఏంటి?
అబ్రహాం లింకన్ సిబ్బంది పరిస్థితిపై వస్తున్న ఆందోళనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దగా పట్టించుకోనట్లు వ్యాఖ్యానించారు. నౌక తొమ్మిది నెలలుగా మోహరింపులో ఉండటంపై ప్రశ్నించగా.. ఆ మోహరింపు “ఇంకా ఎక్కువ కాలం కొనసాగాల్సింది” అన్న భావనలో మాట్లాడారు.
రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ కూడా సిబ్బంది పరిస్థితిపై వచ్చిన కొన్ని నివేదికలు వాస్తవాన్ని తప్పుగా చూపిస్తున్నాయని పేర్కొన్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం తమకు వచ్చిన సమాచారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హోర్ముజ్ సంక్షోభంతో సంబంధం
ఈ నౌక మార్పు జరుగుతున్న సమయంలోనే హోర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇరాన్పై అమెరికా ఒత్తిడి, సముద్ర మార్గాల్లో నౌకాయానం, చమురు రవాణా వంటి అంశాల్లో అమెరికా నౌకాదళానికి కీలక పాత్ర ఉంది.
ఇటీవల హోర్ముజ్ ప్రాంతంలో వాణిజ్య నౌకల రాకపోకలపై కూడా ఉద్రిక్తతలు పెరిగాయి. యూఏఈ తన ADNOCకు అనుబంధ నౌకపై ఇరాన్ దాడి చేసిందని ఆరోపిస్తూ ఖండించింది. ఇదే సమయంలో ఒమన్ తీరంలో ట్యాంకర్ నుంచి చమురు లీకేజీ కారణంగా సుమారు 12 కిలోమీటర్ల తీరప్రాంతం ప్రభావితమైనట్లు అక్కడి అధికారులు తెలిపారు.
అందువల్ల అమెరికా కొత్త విమాన వాహక నౌకను పంపడం.. హోర్ముజ్, ఇరాన్ చుట్టూ తన నౌకాదళ ఉనికిని కొనసాగించాలన్న వాషింగ్టన్ నిర్ణయానికి సంకేతంగా చూడవచ్చు.
అసలు కథ ఏంటి?
USS Abraham Lincolnను వెనక్కి పంపడం కేవలం సిబ్బంది సమస్యల పరిష్కారానికేనా? లేక మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక మోహరింపును కొనసాగించేందుకు సాధారణ నౌకాదళ రొటేషనా? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
ఒకవైపు 260 రోజులకు పైగా సాగిన లింకన్ మోహరింపు సిబ్బందిపై భారీ ఒత్తిడిని తెచ్చిందన్న కుటుంబాలు, మాజీ సైనికుల ఆందోళనలు ఉన్నాయి. మరోవైపు అమెరికా నేవీ మాత్రం నౌక మిషన్ కొనసాగించే సామర్థ్యాన్ని, సిబ్బంది సంసిద్ధతను సమర్థిస్తోంది.
అయితే జార్జ్ వాషింగ్టన్ తరలింపు ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తోంది . ఇరాన్, హోర్ముజ్ సంక్షోభం నుంచి అమెరికా ఇంకా పూర్తిగా వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదు. తన నౌకాదళ శక్తిని కొనసాగిస్తూ, అవసరమైతే దీర్ఘకాలం ఈ ప్రాంతంలో ఉండేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
