త్రివర్ణ పతాకం రెపరెపలు
భూపాలపల్లి మండలంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు
దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : భూపాలపల్లి మండలంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మీరాజం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను స్మరించుకున్నారు.
మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో తరుణ్ ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండలంలోని వివిధ గ్రామాల గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జాతీయ పతాకాలను ఆవిష్కరించి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు జాతీయ పతాకాలను ఆవిష్కరించి దేశభక్తి నినాదాలతో సందడి చేశారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో మండలవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు ఉత్సాహంగా పాల్గొని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
