విరూపాక్షి బెయిల్‌పై వాయిదా

ఈనెల18కు విచారణ వాయిదా..
ఆదోని కోర్టులో వాదనలు

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : అట్రాసిటీ కేసులో అరెస్టయి కర్నూలు జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బి. విరూపాక్షి బెయిల్‌ పిటిషన్‌పై గురువారం ఆదోని సెకండ్‌ క్లాస్‌ కోర్టులో వాదనలు జరిగాయి. ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు మరో 20 మందికి బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టు సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. బెయిల్‌ పిటిషన్లపై ఉదయం కోర్టు వాదనలు విన్నది.

తొలుత విచారణను సాయంత్రం 5 గంటలకు వాయిదా వేసింది. అనంతరం పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు. ఎమ్మెల్యేతో పాటు మరో 20 మంది బెయిల్‌ పిటిషన్లపై తదుపరి విచారణలో వాదనలు కొనసాగనున్నాయి. దీంతో 18న కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.