Breaking | ఏడుగురు కూలీలు దుర్మరణం..
- ఆటోని ఢీకొన్న లారీ… చల్లాచెదురుగా మృతదేహాలు..
- మృతులంతా కర్ణాటక వాసులే
సంగారెడ్డి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలోని యూటర్న్ వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 14 మంది ఉన్నట్టు సమాచారం.
కర్ణాటక రాష్ట్రంలోని హుమనాబాద్ నుంచి జహీరాబాద్ వైపు ట్యాంకర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అదే సమయంలో కూలీలను తీసుకెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మృతి చెందిన వారంతా కర్ణాటక రాష్ట్రం రాజగిరికి చెందినవారిగా ప్రాథమికంగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


