హామీల అమలుపై బీజేపీ పోరుబాట..

చౌటుప్పల్‌లో విస్తృత సమావేశం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: కాంగ్రెస్‌ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు డాక్టర్‌ గంగిడి మనోహర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని ఎస్‌.ఎం. రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో బీజేపీ మండల, మున్సిపాలిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

మండల అధ్యక్షుడు కైరంకొండ అశోక్‌, పార్టీ మున్సిపల్‌ అధ్యక్షురాలు కడారి కల్పనా ఐలయ్య యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, నిరసన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. హామీల అమలు కోసం ప్రభుత్వంపై నిరసనలు, ధర్నాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసే ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ రెండో విడతలో భాగంగా బీఎల్‌ఏ-2లు, పార్టీ నాయకులకు తగిన సూచనలు చేశారు. పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్‌ కమిటీల పనితీరు, భవిష్యత్‌లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నిశితంగా చర్చించారు.

స్థానిక సమస్యలపై బీజేపీ ఆగ్రహం

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విఫలమైందని మనోహర్‌రెడ్డి విమర్శించారు. స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన, రైతుల సమస్యల పరిష్కారం, చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలో ఫ్లైఓవర్‌ నిర్మాణం, వంద పడకల ఆసుపత్రి నిర్మాణం వంటి అంశాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. ఆయా పనులను తక్షణమే పూర్తి చేసి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడెల భిక్షంగౌడ్‌, జిల్లా ఉపాధ్యక్షులు శాగ చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచులు తంగెళ్ల వెంకటేష్‌, కైరంకొండ స్వప్న అశోక్‌, టేకుల మంజులారెడ్డి, నందగిరి వెంకటేష్‌, బోయ మహేంద్రమని, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బుడ్డ సురేష్‌, కౌన్సిలర్లు ఆలె శ్రీలత చిరంజీవి, పొలేపల్లి లక్ష్మి ముత్తయ్య, నాయకులు ముత్యాల భూపాల్‌రెడ్డి, కంది లక్ష్మారెడ్డి, గడ్డం నర్సింహ, బత్తుల జంగయ్య, యాస అశోక్‌రెడ్డి, ఫకీరు శ్రీనివాస్‌రెడ్డి, నాగరాణి, దివ్య, గౌతమ్‌, వంశీ, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.