వెలగపూడి – ఏపీలో పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. కోస్తా ఆంధ్రాలోని అల్లూరి, విశాఖ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వానాలు పడుతున్నాయి. గాలివానకు పలు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉండటంతో ప్రజలందరూ అలర్టుగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది
ఒక్కసారిగా మారిన వాతావరణం..
ఏలూరు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మెగావృతమైన ఆకాశం భారీ గాలితో కూడిన వర్షం పడింది. రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగులకు కొంత ఉపసమనం కలిగింది. కోణసీమ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అమలాపురంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్సం పడింది. అకాలవర్షంతో మామిడి సహా పలు ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోవడంతో పగలే చీకటిగా మారిపోయిన వాతావరణం పట్టపగలు సైతం వాహనాలు లైట్లు వేసుకుని వెళుతున్న పరిస్థితి నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజవర్గం తాళ్లపూడి చాగల్లు మండలంలో పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. నిడదవోలు మండలంలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసింది.