Laddu-Atm : దసరాకు బిగ్ ప్లాన్.Andhra Prabha Top Story
Laddu-Atm : దసరాకు బిగ్ ప్లాన్.Andhra Prabha Top Story
- మిషన్ నొక్కు.. లడ్డూ పట్టు
- దుర్గగుడిలో సరికొత్త టెక్నాలజీ..
- క్యూ లైన్లు ఉండవు..
- భక్తులకు హ్యాపీ హ్యాపీ
- ఆన్లైన్లో బుకింగ్..
- ఏటీఎంలో ప్రసాదం..
- ప్రణాళికలతో అధికారులు సిద్ధం .
(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ,)
విజయవాడ దుర్గమ్మ భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఈ ఏడాది దసరా శరన్నవరాత్రుల వేళ కనకదుర్గమ్మ ఆలయంలో ఏటీఎం ద్వారా భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందించే కార్యక్రమానికి రూపకల్పన జరుగుతుంది. భక్తులు లడ్డూ ప్రసాదం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడే అవస్థలకు ఇక చెక్ పెట్టే విధంగా దుర్గగుడిలో లడ్డూ ఏటీఎం’ మిషన్లను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. అతి సులభంగా భక్తులు క్షణాల్లో అమ్మవారి లడ్డూని కొనుగోలు చేసే అవకాశం దీని ద్వారా లభించనుంది.
Laddu-Atm : అతి త్వరగా…
భక్తులు ముందుగా ఆన్లైన్ ద్వారా తమకు కావలసిన లడ్డూలను బుక్ చేసుకోవాలి. బుకింగ్ కాగానే మీ మొబైల్కు ఒక ప్రత్యేక కోడ్ వస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏటీఎం మిషన్ వద్దకు వెళ్లి ఆ కోడ్ను ఎంటర్ చేస్తే చాలు… కేవలం కొన్ని సెకన్లలోనే వేడివేడి లడ్డూ ప్రసాదం మీ చేతికి అందుతుంది. రద్దీని తగ్గించేందుకు ఆలయ పరిసరాల్లో మొత్తం 4 నుండి 5 ఏటీఎం యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మిషన్ల ద్వారా భక్తులు ఒకేసారి ఒకటి నుండి ఆరు లడ్డూల వరకు పొందే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు. టెక్నాలజీ పుణ్యమా అని భక్తులకు క్యూ లైన్ల తిప్పలు తప్పనున్నాయి.
Laddu-Atm : పని చేసే విధానం…
భక్తులు ముందుగా ఆన్లైన్ ద్వారా లడ్డూలను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ పూర్తయ్యాక మొబైల్కు ఒక కోడ్ (లేదా క్యూఆర్ కోడ్/పాస్వర్డ్) వస్తుంది.ఆ కోడ్ను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏటీఎం మిషన్లో నమోదు చేయాలి. కోడ్ ఎంటర్ చేసిన వెంటనే యంత్రం నుండి లడ్డూ ప్రసాదం బయటకు వస్తుంది. ఏర్పాట్లు ఆలయ పరిసరాల్లో మొత్తం 4 నుండి 5 ఏటీఎం మిషన్లను ఏర్పాటు చేయనున్నారు. భక్తులు ఒకేసారి ఈ మిషన్ ద్వారా ఒకటి నుండి ఆరు లడ్డూల వరకు పొందేలా సాంకేతికతను రూపొందిస్తున్నారు. ఈ విధానం వల్ల ఉత్సవాల రద్దీ సమయంలో భక్తులు ప్రసాదం కౌంటర్ల వద్ద గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం తప్పుతుంది.
Laddu-Atm : దసరా ఉత్సవాల్లో…
ఈ ఏడాది అక్టోబర్ నెలలో జరిగే దసరా నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు నుండే ఈ మిషన్లను ప్రారంభించే సాధ్యసాధ్యాలను ప్రస్తుతం అధికారులు అధ్యయనం చేస్తున్నారు. దసరా ఉత్సవాలలో భక్తులు లక్షల సంఖ్యలో లడ్డూలు కొనుగోలు చేస్తుండడం, లడ్డు కోసం ఎదురుచూసే ఇబ్బందులను అధిగమించేందుకు అధికారులు ఈ సరికొత్త విధానం అమల్లోకి తీసుకువచ్చే విధివిధానాలను రూపొందించే పనిలో ఉన్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఏటీఎం లడ్డు ఇంద్రకీలాద్రి నుండే భక్తులకు అందుబాటులోకి రానుంది. ఈ నూతన సాంకేతిక విధానానికి సంబంధించిన సాఫ్ట్వేర్, ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్, మిషన్ల ట్రయల్ రన్కు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఉత్సవాల సమయంలో వచ్చే భారీ రద్దీని తట్టుకోవడానికి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రసాదం అందించడమే లక్ష్యంగా ఈ దసరా నుండే దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
. Laddu-Atm : లక్షల సంఖ్యలో లడ్డు విక్రయాలు…
శ్రీ కనకదుర్గమ్మ వారికి అత్యంత ప్రతిష్టాత్మకంగా అట్టహాసంగా నిర్వహించే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో లడ్డు విక్రయాలు లక్షలలో కొనసాగుతాయి. గత ఏడాది దసరా ఉత్సవాలలో సుమారు 30 లక్షలకు పైగా లడ్డు విక్రయాలు జరగగా, ఈ ఏడాది 35 లక్షలు మించి విక్రయాలు జరిగే అవకాశం ఉందని అధికారులు ముందస్తుగా అంచనా వేస్తున్నారు. ఇంద్రకీలాద్రి కి భక్తుల రాక రోజురోజుకీ పెరుగుతుండడం దసరా ఉత్సవాల సందర్భంగా ఈ రాక మరింత పెరిగే అవకాశం ఉన్న పరిస్థితులలో లడ్డు విక్రయాలు కూడా గణనీయంగా పేరగచ్చన్న ముందస్తు అంచనా తో అధికారులు ఏటీఎం లడ్డు మిషన్లను అందుబాటులోకి తీసుకువచ్చే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.
