విద్యుత్ షాక్‌తో మెకానిక్ దుర్మరణం..

మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ చెక్‌పోస్ట్ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైడ్రాలిక్ ప్రెస్ వద్ద పనిచేస్తున్న ఓ మెకానిక్ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పనిచేస్తున్న చోటే యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో తోటి కార్మికుల్లో విషాదం నెలకొంది.

పోలీసులు, తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన సునీల్ రామ్ (26) మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద ఉన్న హెచ్‌కేజీఎన్ హైడ్రాలిక్ ప్రెస్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో షిఫ్ట్ విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన సునీల్ రామ్ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువ కార్మికుడు అకస్మాత్తుగా మృతి చెందడంతో తోటి సిబ్బంది, కార్మికుల్లో తీవ్ర విషాదం నెలకొంది.