కమలం వ్యూహాత్మకమేనా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక బీజేపీ రాజకీయ లెక్కలు
కమలం వ్యూహాత్మకమేనా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక బీజేపీ రాజకీయ లెక్కలు
- భవిష్యత్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చిన బీజేపీ
- నీట్ వివాదం, విద్యార్థి ఉద్యమం ప్రభుత్వంపై ఒత్తిడి
- పార్లమెంట్ వ్యూహం కోసం చిన్న రాజకీయ త్యాగమా?
- డీలిమిటేషన్ బిల్లు, రాజ్యాంగ సవరణలపై కమలం దృష్టి
- రాజకీయ ప్రతిష్ఠా? లేక వ్యూహాత్మక వెనుకడుగా?
బీజేపీ ఎప్పుడూ భవిష్యత్తును, వ్యూహాత్మకంగా దృష్టిలో పెట్టుకుని అడుగులు వేసే పార్టీ. ఒక మంత్రి రాజీనామా చేస్తే అది భవిష్యత్తులో ఒక కొత్త సంప్రదాయానికి నాంది పలుకుతుందనే ఆందోళనతోనే ధర్మేంద్ర ప్రధాన్ను తొలుత తప్పించేందుకు పార్టీ ఇష్టపడలేదు. అయితే, పార్లమెంట్లో ముందున్న మరింత కీలకమైన రాజకీయ లక్ష్యాల కోసం చివరికి ప్రధాన్ను చిన్న త్యాగంగా భావించి ఆ నిర్ణయం తీసుకుంది.
కాలేజీల్లోని చెక్క బెంచీలపై ప్రేమ సందేశాలు, సూక్తులు చెక్కడం సర్వసాధారణం. వాటిలో “ఈ రోజు ఒక బహుమతి… అందుకే దాన్ని ‘ప్రెజెంట్’ అంటారు” ఇలాంటి సూక్తులు కూడా కనిపిస్తుంటాయి. కానీ బీజేపీ అలాంటి చిన్న పట్టణాల కాలేజీల్లో రాజకీయ పాఠాలు నేర్చుకున్న పార్టీ కాదు. స్వాతంత్య్రానంతర భారతదేశంలోని తీవ్రమైన రాజకీయ పోటీ వాతావరణమే దానికి అసలైన పాఠశాల. అక్కడ మనుగడే మొదటి లక్ష్యం. రేపటి సవాళ్లను ముందుగానే అంచనా వేసుకుంటూ సాగడమే దాని రాజకీయ స్వభావంగా మారింది.
న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రజలు చేరకముందే, కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిందని దేశవ్యాప్తంగా లక్షలాది మంది భావించారు. ముందుగా నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్, తర్వాత సీబీఎస్ఈ ఆన్లైన్ మార్కింగ్ విధానానికి సంబంధించిన గందరగోళం చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాలతో దేశ ఉన్నత విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారినా, పార్టీ గానీ ప్రభుత్వం గానీ తగిన చర్యలు తీసుకోవడంలోనూ, ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వడంలోనూ విఫలమయ్యాయి.
ప్రతిపక్షం ఈ అంశంపై చురుకుగా వ్యవహరించని సమయంలో, యువత ముందుకు వచ్చారు. సోనమ్ వాంగ్చుక్ తన నిరాహార దీక్షతో అప్పుడప్పుడే ఊపందుకుంటున్న ఆ ఉద్యమానికి మరింత బలం చేకూర్చారు. అయితే వారు సాధించలేకపోయిన ప్రభావాన్ని ఢిల్లీ పోలీసులు తమ చర్యలతో కలిగించారు. జూలై 20న నిరసనకారులపై, వారిలో వేలాది మంది మైనర్లు కూడా ఉండగా, పోలీసులు అత్యంత కఠినంగా బలప్రయోగం చేయడం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. దీంతో బీజేపీ రాజకీయంగా ఇరుక్కుపోయింది.
‘రేపు ఏమవుతుందో?’ అనే ఆలోచనతో బీజేపీ తప్పనిసరిగా జరగాల్సిన నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేయాలని ప్రయత్నించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే అది భవిష్యత్తులో ఒక పూర్వ ఉదాహరణగా మారుతుందనే ఆందోళనే ఆయనను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. అయితే నిర్ణయం ఆలస్యం కావడంతో ప్రజల డిమాండ్లను పట్టించుకోని మొండి ప్రభుత్వంగా బీజేపీ కనిపించడం ప్రారంభమైంది.
ఇదే సమయంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగం పుంజుకున్నాయి. నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్కు మద్దతుగా ప్రతిపక్ష నేతలు జంతర్ మంతర్ చేరుకున్నారు. జూలై 20న సమావేశాలు ప్రారంభమైనా మొదటి వారం మొత్తం సభా కార్యక్రమాలు దాదాపు స్తంభించిపోయాయి. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభలోనూ, ప్రధానమంత్రి నివాసం ఎదుట కూడా నిరసన వ్యక్తం చేసి పోలీసుల అదుపులోకి వెళ్లారు. ప్రభుత్వం తన శాసన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్షం వ్యవహరించింది. ప్రభుత్వం లక్ష్యాలు ఏమిటో ప్రతిపక్షానికి, ప్రతిపక్ష వ్యూహం ఏమిటో ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు.
ఈ పరిస్థితుల్లో కేంద్రంలోని ఇద్దరు సీనియర్ మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సోనమ్ వాంగ్చుక్ను నిరాహార దీక్ష విరమింపజేయడంలో విజయవంతమయ్యారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఆయన పట్టుదలను కూడా కొంతమేర తగ్గించగలిగారు.
అయితే అప్పటికే ఆ ఉద్యమం సోనమ్ వాంగ్చుక్ లేదా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పరిధిని దాటి చాలా పెద్ద ప్రజా ఉద్యమంగా మారిపోయింది. ఆ ఆందోళన దేశవ్యాప్తంగా విస్తరించింది. ఒకసారి రాజుకున్న ఆ మంటలను చల్లార్చాలంటే, రాజకీయంగా ఏదో ఒక త్యాగం తప్పనిసరి అనే పరిస్థితి ఏర్పడింది.
కఠినమైన చట్టాలు, వేగవంతమైన ప్రత్యేక న్యాయస్థానాలు లేదా ప్రచార వీడియోలు ఈ ఆగ్రహాన్ని తగ్గించలేవని బీజేపీ గ్రహించింది. అప్పటికే దేశ ఉన్నత విద్యా వ్యవస్థ కుప్పకూలిన పరిస్థితికి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతీకగా మారిపోయారు. అందుకే ఆయననే రాజకీయంగా త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ దశలో బీజేపీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రధాన్ రాజీనామా పూర్వ ఉదాహరణగా మారినా పెద్ద రాజకీయ లక్ష్యాలే ముఖ్యమని నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వర్షాకాల సమావేశాల్లో కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశముంది.
ఈ బిల్లు ప్రభుత్వానికి ఎంతో ప్రాధాన్యమైనది. ఈ ఏడాది ఏప్రిల్లో మహిళలకు శాసనసభలు, పార్లమెంట్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుతో దీనిని అనుసంధానించి ఆమోదింపజేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలను కూడా నిర్వహించింది. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సమీకరించలేకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు తొలిసారిగా ఓటమి పాలైన సందర్భం అదే.
అయితే ఏప్రిల్ తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. పార్టీ ఫిరాయింపులు, అంతర్గత విభేదాలు, ప్రతిపక్ష ఐక్యత లోపించడం, రాజకీయ సమీకరణాల్లో మార్పులు రావడంతో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయవచ్చనే ఆశ ప్రభుత్వానికి కలిగింది.
ఈ సంఖ్యాబలం యాదృచ్ఛికంగా రాలేదు, డీలిమిటేషన్ లక్ష్యంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా రాజకీయ సమీకరణాలు నిర్మించింది. అయితే శరద్ పవార్, ఎం.కే. స్టాలిన్ వంటి కీలక నాయకులను ఒప్పించడం కూడా అవసరం.
అందువల్ల ఈ వర్షాకాల సమావేశాలు బీజేపీ రాజకీయ చాతుర్యం, ప్రతిపక్ష ఐక్యతను దెబ్బతీసే వ్యూహాలకు పరీక్షగా నిలవాల్సి ఉంది. కానీ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం మిగతా అంశాలను పక్కన పెట్టింది. కాంగ్రెస్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బీజేపీ పార్లమెంట్ కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగుతున్నంత కాలం ప్రభుత్వం తన ప్రధాన శాసన కార్యక్రమాన్ని ముందుకు తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ బలిగా మారారు.
పార్టీ ప్రతిష్ఠను కాపాడుకోవాలా? లేక ఎన్నో రోజులుగా సిద్ధం చేసిన పెద్ద రాజకీయ లక్ష్యాలను సాధించాలా? అనే ప్రశ్నలో ప్రభుత్వం రెండో మార్గాన్నే ఎంచుకుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు తాత్కాలికంగా వెనక్కి తగ్గి, మరింత పెద్ద పోరాటానికి సిద్ధమైంది.
అప్పటికే ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకమైన భావన ఏర్పడింది. జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు యువ ఉద్యమకారులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలతో చర్చలు జరపడం కూడా అనుకూల దృశ్యంగా కనిపించలేదు.
అయితే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పే ప్రమాదం ఎదురైనప్పుడు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గడం మోదీ ప్రభుత్వానికి కొత్త విషయం కాదు. సుదీర్ఘ రైతుల ఉద్యమం అనంతరం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం ఇందుకు ఉదాహరణ.
రైతుల ఉద్యమం కూడా జంతర్ మంతర్ ఉద్యమంలాగే క్రమంగా ప్రభుత్వ నియంత్రణకు అతీతంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఏ ప్రభుత్వం కూడా ఒక ఉద్యమం తమ చేతుల్లోంచి జారిపోయి అదుపు తప్పడం కోరుకోదు. పార్లమెంట్లో ప్రభుత్వానికి అప్పటికే ఎంతో కీలకమైన రాజకీయ లక్ష్యం ఉండటంతో, ధర్మేంద్ర ప్రధాన్ త్యాగం చిన్నదే. సంప్రదాయం, ప్రతిష్ఠ, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చే బీజేపీ, పరిస్థితి ఇంతగా ముదరక ముందే ధర్మేంద్ర ప్రధాన్ను ఎందుకు తప్పించలేదనే ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. ఎదుగుదల దిశగా సాగుతున్న ఒక రాజకీయ పార్టీ, జర్మన్ తత్వవేత్త ఫ్రెడ్రిక్ నీషే చెప్పిన ‘అహం‘ (ఈగో)ను ఎందుకు విడిచిపెట్టలేకపోయింది?
