సూర్యాపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది
సూర్యాపేట, ఆంధ్రప్రభ : పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది రాష్ట్ర పురపాలక పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ అండ్ డైరెక్టర్ టీ కే శ్రీదేవిని కోరారు. శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర పురపాలక పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ అండ్ డైరెక్టర్ టీ.కే. శ్రీదేవిని కలిసి వినతిపత్రం సమర్పించారు. పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధి, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య విభాగంలో ఖాళీ పోస్టుల భర్తీ, త్రాగునీటి సరఫరా మెరుగుదల, యూజీడీ పనుల అనంతరం రోడ్ల పునరుద్ధరణతో పాటు శ్రీ లింగమంతుల స్వామి గుట్ట చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు వివిధ గ్రాంట్ల ద్వారా ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరారు.
మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా టెక్నీకల్ పర్సన్ (టీఓ), అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), పరిశుభ్రత విభాగంలో శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణపై ప్రభావం పడుతోందని వివరించారు. పట్టణంలో తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు అదనపు పైప్లైన్ల ఏర్పాటు కోసం నిధులు అవసరమని, ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. పట్టణంలో జరుగుతున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనుల కారణంగా తవ్విన రోడ్లను ఇప్పటికీ పూర్తిస్థాయిలో పునరుద్ధరించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని టీ.కే. శ్రీదేవి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆమె సంబంధిత అధికారులతో పాటు కాంట్రాక్టర్తో నేరుగా ఫోన్లో మాట్లాడి, రోడ్ల పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
