బ్రహ్మోత్సవాల నాటికి రాజగోపురం పూర్తి చేయాలి: మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్, ఆంధ్రప్రభ: మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి ఆలయ రాజగోపురం నిర్మాణ పనులను రానున్న బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. బుధవారం రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న రాజగోపురానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాంబవంతుల వారిచే ప్రతిష్ఠించబడిన శ్రీ పడమటి ఆంజనేయస్వామి మక్తల్ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమని, స్వామివారికి సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
గత ఏడాది ఆలయ కోనేరును (పుష్కరిణి) పునరుద్ధరించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేసిన మంత్రి, రానున్న డిసెంబర్లో జరిగే బ్రహ్మోత్సవాల నాటికి రాజగోపురం నిర్మాణం కూడా పూర్తయితే భక్తులకు మరింత ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు. అత్యంత సుందరంగా గోపురాన్ని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పి. ప్రాణేశాచారి, మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస హన్మంతు, మాజీ జడ్పీటీసీ జి. లక్ష్మారెడ్డి, మార్కెట్ డైరెక్టర్ పారేవుల విష్ణువర్థన్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీవిద్య నీలాగౌడ్, అనిత, వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు, ఆలయ ఈఓ నిత్యానంద చారి తదితరులు పాల్గొన్నారు.
