Crude Oil Prices | ముడి చమురు ధరల తగ్గుదలతో మార్జిన్ల పెరుగుదల

Crude Oil Prices | ముడి చమురు ధరల తగ్గుదలతో మార్జిన్ల పెరుగుదల

Crude Oil Prices | ఎల్పీజీ నష్టాలు తగ్గి లాభాల్లోకి వచ్చే అవకాశం
రుణ భారం, పన్నుల అనిశ్చితి ఓఎంసీలకు సవాల్
రెండో త్రైమాసికంలో లాభదాయకత మెరుగుపడనుందా?

Crude Oil Prices | న్యూఢిల్లీ : అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి అంగీకారం కుదిరిన తరువాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. దీని ఫలితంగా ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) మార్జిన్లు మెరుగుపడి, లాభదాయకత పెరుగుతుందని జేపీ మోర్గాన్ తాజా నివేదికలో పేర్కొంది. లాభదాయకత పెరుగుతున్నప్పటికీ, పెరుగుతున్న రుణ స్థాయిలు, ఇంధన పన్నులపై అనిశ్చితి ఈ రంగం దీర్ఘకాలిక ఆదాయాల అంచనాలను పరిమితం చేయవచ్చని అభిప్రాయపడింది.

ముడి చమురు ధరలు తగ్గడంతో పాటు కేంద్ర ఎక్సైజ్ సుంకాలు తగ్గినందున ప్రభుత్వ రంగ రిఫైనరీలు, ఇంధన రిటైలర్ల పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై మార్జిన్లు మధ్యప్రాచ్య యుద్ధానికి ముందు కంటే పెరిగాయని జేపీ మోర్గాన్ నివేదిక తెలిపింది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తరువాత చమురు ధరలు పెరిగాయి. భారత్‌లో మాత్రం రిటైల్ రేట్లు కొంత మేర ప్రభుత్వం పెంచింది. మే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు మొత్తంగా రూ.7.50 పెరిగాయి. ఈ ధరల్లో రిటైల్ రేట్లు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగానే ఉన్నాయి.

పెట్రోల్, డీజిల్‌పై ఓఎంసీ కాంపోజిట్ మార్జిన్లు ఇప్పుడు యుద్ధానికి ముందు స్థాయిలకంటే ఎక్కువగా ఉన్నాయని, ఎల్పీజీపై నష్టాలు ఇప్పటికీ అధికంగానే ఉన్నప్పటికీ ఇవి కూడా త్వరలోనే తగ్గి లాభాల్లోకి వస్తాయని జేపీ మోర్గాన్ స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో భారీ ఇన్వెంటరీ నష్టాల కారణంగా ఆదాయాలు దెబ్బతినే అవకాశం ఉన్నప్పటికీ, రెండవ త్రైమాసికంలో లాభదాయకత మెరుగ్గా ఉంటుందని తెలిపింది.

మార్జిన్లలో పెరుగుదల విషయంలో తమ అభిప్రాయాన్ని రెండు అంశాలు పరిమితం చేస్తున్నాయని పేర్కొంది. ఒకటి, గత కొన్ని నెలల్లో చమురు మార్కెటింగ్ సంస్థలు గణనీయంగా రుణాన్ని తీసుకుని ఉండటం, ఇది వాల్యుయేషన్లను ప్రభావితం చేస్తుందని తెలిపింది. రెండవది, లాభదాయకత పునరుద్ధరణలో ప్రధాన భాగం ఎక్సైజ్ సుంకాల తగ్గింపు కారణంగానే జరిగిందని పేర్కొంది. ప్రభుత్వం కొంతకాలం పాటు పన్నులను తక్కువగా ఉంచే అవకాశం ఉంది. ఇది ఇంధన మార్కెటింగ్ కంపెనీల రుణ చెల్లింపునకు వీలు కల్పిస్తుంది. అయితే, చివరికి ఎక్సైజ్ సుంకాలు పెరిగే ప్రమాదం కూడా ఉందని తెలిపింది.

రిటైల్ ధరలలో తక్షణ పెరుగుదలను నివారించడానికి ప్రభుత్వం మార్చిలో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు యుద్ధానికి ముందు స్థాయికి పడిపోయి స్థిరపడిన తరువాత ప్రభుత్వం మళ్లీ ఎక్సైజ్ సుంకాలు పెంచవచ్చని అంచనా వేసింది.

మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లలో చమురు ధరలు తగ్గుతూనే ఉంటే సమీప భవిష్యత్తులో ఈ కంపెనీలు ప్రయోజనం పొందుతాయని పేర్కొంది.

బీపీసీఎల్, ఐఓసీ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ మార్జిన్లు యుద్ధానికి ముందు స్థాయిల కంటే ఎక్కువగా ఉన్నాయని, హెచ్‌పీసీఎల్ మార్జిన్లు చమురు ధరల పెరుగుదలకు ముందు ఉన్న స్థాయిలకు వచ్చాయని పేర్కొంది. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్ల కంటే తక్కువగా ఉండి, రిఫైనింగ్ మార్జిన్లు అధికంగా కొనసాగితే రెండవ త్రైమాసికం నుంచి కంపెనీల ఆదాయాలకు అనుకూల మార్జిన్ పరిస్థితులు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది. ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, ఇన్వెంటరీ నష్టాల కారణంగా మొదటి త్రైమాసికంలో ఆదాయాలు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని పేర్కొంది.