అహ్మదాబాద్ – తెలంగాణలో 90 శాతం జనాభా ఓబీసీలు, దళితులు, మైనార్టీలు ఉన్నారని, కానీ రాష్ట్ర సంపద మాత్రం కార్పొరేట్ వర్గాల దగ్గరే ఉందని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. 24 గంటలు ఓబీసీలు, ఆదివాసీల గురించి మాట్లాడే నరేంద్ర మోడీ ఆ వర్గాలకు మాత్రం మేలు చేయరని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను బీజేపీ రద్దు చేసిందని ధ్వజమెత్తారు. అహ్మదాబాద్లో జరిగిన ఎఐసిసి సమావేశంలో నేడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ,. కులగణనతోనే దేశంలో ఓబీసీలు, దళితులు, మైనార్టీల సంఖ్య తేలుతుందని, కానీ దీనికి ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యతిరేకమని విమర్శించారు. జాతీయ స్థాయిలో జనగణనలో కులగణన జరిపే వరకు పోరాటం చేస్తామన్నారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి అంశాన్ని తొలగిస్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ఒక్కొక్కటిగా అదానీ, అంబానీకి విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. సిమెంట్, స్టీల్, ఎయిర్పోర్టులు, గనులు సహా కీలక పరిశ్రమలన్నీ అదానీకే అప్పగిస్తున్నారని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లు వేస్తుంటే మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
మహాత్మ గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, అంబేద్కర్, గురునానక్, కబీర్ ఆలోచనల రూపం భారత రాజ్యాంగం అని రాహుల్ గాంధీ అన్నారు. భారత రాజ్యాంగం 75 ఏళ్ల నాటి పుస్తకంగా భావించరాదని.. వేలాది సంవత్సరాలుగా భారత దేశ ప్రజల ఆలోచన విధానమే “భారత రాజ్యాంగం” అని స్పష్టం చేశారు. దీనిని రాజ్యాంగం, మన ఐడియాలజీ మనమే కాపాడుకోవాలన్నారు. కాంగ్రెస్ ఐడియాలజీ రాజ్యాంగమని.. అందుకే బీజేపీ ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు మన రాజ్యాంగాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఇది తన బాధ్యత అన్నారు.
బీజేపీ తమ వ్యవస్థ మీద దాడి చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత స్వేచ్ఛ మీద దాడి చేస్తున్నాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణాలో కుల గణ అంశంపై స్పందించారు. కులగణనపై మంచి స్పందన వచ్చిందన్నారు. మైనార్టీలు, ఆదివాసులు, గిరిజనుల కోసం కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. జాతీయ జన గణన చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. “తెలంగాణలో కుల గణనపై రేవంత్ రెడ్డి నాకు వివరించారు. తెలంగాణలో ఓసీలు, బీసీలు మైనార్టీలు ఎంత అనేది తేలింది. తెలంగాణ లో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. దేశానికే ఆదర్శంగా నిలిచాం. రాష్ట్రంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసులకు సరైన ప్రాతినిధ్యం లేదని స్పష్టమైంది. దేశ జనాభాలోని 90 శాతం మంది జనాభాకు సరైన ప్రాతినిధ్యం లేదు. 90 శాతం మంది జనాభా అవకాశాలను లాగేసుకున్నారు. మీరందరూ లేకుండానే “భారత్ జోడో” యాత్ర రాహుల్ గాంధీ చేయగలడా?” అని ప్రశ్నించారు.