పల్నాడు ప్రజలకు శుభవార్త…

పల్నాడు ప్రజలకు శుభవార్త…
పిడుగురాళ్లలో ఎంప్లాయీస్ ట్రైన్ స్టాపేజ్కు రైల్వే శాఖ ఆమోదం….!
ఉత్తర్వులు జారీ…!
పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : లింగంపల్లి – విజయవాడ మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ (12796/12795) రైలుకు పిడుగురాళ్ల స్టేషన్లో స్టాపేజ్కు రైల్వే శాఖ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన సమయాల్లో రైళ్లు లేక ఇబ్బంది పడుతున్న పల్నాడు ప్రజలకు ఈ స్టాపేజ్ ఒక వరం. దీనికోసం నిరంతరం శ్రమించి విజయం సాధించిన గౌరవ నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలకు పల్నాడు ప్రాంత ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి, పిడుగురాళ్లలో స్టాపేజ్కు తక్షణమే అనుమతి మంజూరు చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి, శ్రీకృష్ణదేవరాయలు ధన్యవాదాలు తెలిపారు.
పల్నాడు జిల్లా ప్రయాణీకులు, ఉద్యోగుల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ… లింగంపల్లి – విజయవాడ – లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెంబర్స్: 12796 / 12795) రైలుకు పిడుగురాళ్ల స్టేషన్లో స్టాపేజ్కు రైల్వే శాఖ అధికారికంగా అనుమతి మంజూరు చేసినట్లు గౌరవ నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో హైదరాబాద్, విజయవాడ వైపు వెళ్లేందుకు పల్నాడు ప్రాంత ప్రజలకు సరైన రైలు రవాణా సదుపాయం అందుబాటులో లేదు. ఈ మార్గంలో ప్రయాణించే అత్యధిక శాతం మంది ప్రజలు, ఉద్యోగులు ఈ రైలుపై ఆధారపడి ఉన్నారు. ప్రయాణీకులు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు ఈ ప్రధాన రవాణా సమస్యను గుర్తించిన ఎంపీ, ఎంప్లాయీస్ రైలును పిడుగురాళ్లలో ఆపడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు లబ్ధి చేకూరుతుందని భావించి, సమస్యను రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లి స్టాపేజ్ సాధించినట్లు పేర్కొన్నారు. తన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి, శ్రీకృష్ణదేవరాయలు ధన్యవాదాలు తెలియజేశారు.

పల్నాడు ప్రజలకు ఉపశమనం….!
లింగంపల్లి – విజయవాడ మధ్య నడిచే ఈ ‘”ఎంప్లాయ్స్ ట్రైన్'” పిడుగురాళ్లలో ఆగడం వల్ల నిత్యం విజయవాడ, హైదరాబాద్ వైపు వెళ్లే వందలాది మంది ఉద్యోగులకు, పై చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు, వ్యాపారస్తులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఎంపీ తెలిపారు. ఇప్పటివరకు సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడిన పల్నాడు పరిసర ప్రాంతాల ప్రజలు ఇకపై ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. త్వరలోనే ఈ స్టాపేజ్ అమలులోకి వచ్చే తేదీ, సమయాల పూర్తి వివరాలను రైల్వే శాఖ అధికారికంగా ప్రకటిస్తుందని శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు.
రైలు రాక-పోక వివరాలు (సమయాలు)…
ట్రైన్ నెం. 12796 (లింగంపల్లి – విజయవాడ): ప్రతిరోజూ ఉదయం 04:40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, సికింద్రాబాద్ (05:20) మీదుగా ఉదయం 10:35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
ట్రైన్ నెం. 12795 (విజయవాడ- లింగంపల్లి): ప్రతిరోజూ సాయంత్రం 17:30 గంటలకు (05:30 పీఎం ) విజయవాడలో బయలుదేరి, రాత్రి 23:35 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.

