పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలు

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : జిల్లాలో పదన తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్, ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు.
పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను, సీసీ కెమెరా వ్యవస్థను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం, బందోబస్తు, తాగునీరు, ప్రథమ చికిత్స వసతి తదితర విషయాలను గమనించారు. బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్ లో పరీక్షల నిర్వహణలో పలు లోపాలను గుర్తించిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు ఆస్కారం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని జిల్లా విద్యా శాఖ అధికారిని ఆదేశించారు. తక్షణమే బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్ ను సందర్శించి నిర్వహణాపరమైన లోపాలను చక్కదిద్దాలని సూచించారు. విద్యార్థులు దగ్గర దగ్గరగా కూర్చుండి పరీక్షలు రాస్తున్నారని, మరో ఐదు అదనపు గదులను పరీక్షల నిర్వహణ కోసం వినియోగించాలని, సిట్టింగ్ అరేంజ్మెంట్ పక్కాగా ఉండాలని అన్నారు.
పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని అన్నారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా చూడాలని అన్నారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు అధికారులు సమన్వయంతో పని చేస్తూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు సత్యకుమారి, ఎస్.వెంకట్రామ్ రెడ్డి ఉన్నారు.
