Crime | తల్లిదండ్రులను చంపేసిన కూతురు
Crime |తల్లిదండ్రులను చంపేసిన కూతురు
Crime | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడితో ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదని.. కన్న కూతురు తల్లిదండ్రులను హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లాలో దంపతుల మృతి కేసులో ఊహించని ట్విస్ట్ అందరినీ షాక్కు గురయ్యేలా చేసింది. బట్వారం మండలం యాచారం గ్రామంలో దశరథ్, లక్ష్మి దంపతులు నిన్న ఒకరి తర్వాత మరొకరు గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు.
అప్పుల బాధతో దశరథ్ గుండెపోటుకు గురై ప్రాణాలు విడువగా, ఆ బాధను తట్టుకోలేక లక్ష్మి సైతం ప్రాణాలు విడిచిందని కుటుంబ సభ్యులు భావించారు. స్థానికంగా తీవ్ర విషాదం నింపిన ఈ ఘటనపై మృతుల కుమారుడు అశోక్ ఫిర్యాదు ఇవ్వగా.. పోలీసుల ఎంట్రీతో ఊహించని నిజం వెలుగు చూసింది. ఇన్ స్టాగ్రామ్ ప్రియుడి కోసం సొంత కూతురే తల్లిదండ్రులను చంపి ఆపై నాటకం ఆడినట్లు వెల్లడైంది.

దశరథ్, లక్ష్మి దంపతుల కూతురు సురేఖ సంగారెడ్డిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమె ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అయితే తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి చూపులు ఏర్పాటు చేయడంతో ఈ పెళ్లి చూపుల నుంచి తప్పించుకోవాలనే ఉద్ధేశంతో తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి మత్తు ఇంజక్షన్లు తీసుకువచ్చింది. ఒంటి నొప్పులు తగ్గేందుకు డాక్టర్ను అడిగి ఇంజెక్షన్సు తీసుకువచ్చానని తొలుత తల్లికి ఆ తర్వాత తండ్రికి ఓవర్ డోస్ ఇంజెక్ట్ చేసింది. ఆ వెంటనే వారు స్పృహకోల్పోయి పడిపోగా భయాందోళనకు గురైన సురేఖ వెంటనే తన అన్న అశోక్ కు ఫోన్ చేసి అమ్మనాన్న పడిపోయారని నాటకానికి తెరలేపింది.
ఇంటికి చేరుకున్న అశోక్ హుటాహుటీన తల్లిదండ్రులను ఆసుపత్రికి తరలించగా.. వారు అప్పటికే చనిపోయారని వైద్యులు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సురేఖ తీరుపై అనుమానం కలుగగా గట్టిగా ప్రశ్నించడంతో అసలు నిజం బయటకు వచ్చింది. తన ప్రేమ వ్యవహారానికి అడ్డుగా ఉండటం వల్లే తల్లిదండ్రులను చంపినట్లు ఒప్పుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
