ADB | వీరుడా నీ త్యాగాన్ని వృధా కానివ్వం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్, మే 10 (ఆంధ్రప్రభ) : యుద్ధం ఎప్పుడు వచ్చినా దాన్ని ‘ఢీ’ కొట్టడానికి దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని, ముఖ్యంగా యువత ముందు వరుసలో ఉండాలని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పిలుపునిచ్చారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని వెడ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రమూక‌లతో వీరోచితంగా పోరాడి అమరుడైన వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.

అనంతరం 2నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడారు. యుద్ధమే వస్తే నేను సైతం తుపాకీ పట్టి రణరంగంలో ఉండి పోరాడుతానని స్పష్టం చేశారు. దేశం కోసం అమరుడైన జవాన్ మురళీ నాయక్ త్యాగం వృధా పోదని అన్నారు. ఆయ‌న‌ను ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకొని, దేశ రక్షణ కోసం పాటు పడాలన్నారు. యావత్ దేశం, తెలంగాణ రాష్ట్రం భారత సైనిక దళాలకు పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు.

మురళి నాయక్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మాజీ జవానులు డాకురే శత్రుఘన్, నరోటె వినాయక్ లను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఐటీడీఏ పీవీటీజీ ఏపీఓ మేస్రం మనోహర్, ఉపాధ్యాయ సంఘం నాయకులు లక్ష్మణ్, లక్కారం మాజీ సర్పంచ్ మరసుకొల తిరుపతి, అధికారులు, వెడ్మ ఫౌండేషన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, యువతి, యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *