Thorrur | మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం
Thorrur | మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం
- తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్
తొర్రూరు, ఆంధ్రప్రభ: పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సహకారంతో తొర్రూరు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని 4, 5, 6, 7, 8వ వార్డుల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు, అవసరాలు, అభివృద్ధికి సంబంధించిన సూచనలను నేరుగా ప్రజల నుంచే తెలుసుకుని వాటి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో పట్టణాభివృద్ధిని మరింత వేగవంతం చేసి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సహకారంతో అవసరమైన నిధులను సమకూర్చి అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని దశలవారీగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, వార్డు కౌన్సిలర్లు చాపల బాపురెడ్డి, పెదరాని కళావతి సోమయ్య, పేర్ల జంపన్న, మాడుగుల భవానీలత, అల్లం శ్యామల, ఆరోగ్య, విద్య, వైద్య శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
