డ్రగ్ ఫెడ్లర్ ప్రశాంత్గౌడ్ దందాలపై విచారణ జరపాలి

డ్రగ్ ఫెడ్లర్ ప్రశాంత్గౌడ్ దందాలపై విచారణ జరపాలి
- కొండాపూర్ సీఐ తనను చంపేస్తామని బెదిరించారు
- మరోసారి పోలీసులపై తీవ్ర ఆరోపణలు
- వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: డ్రగ్ ఫెడ్లర్ ప్రశాంత్గౌడ్ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కొండాపూర్ మండలం మల్కాపూర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తొగర్పల్లి ప్రభుత్వ పాఠశాల ముందు ప్రశాంత్గౌడ్ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడని ఆరోపిస్తూ, వెంటనే దానిని తొలగించాలని కోరారు.
తన వద్దకు వచ్చి ఆర్థిక సహాయం చేయాలని ప్రశాంత్ అడిగాడని, డబ్బులు ఇవ్వలేదనే కారణంతో తనపై, తన సతీమణిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. ప్రశాంత్గౌడ్ కమిషన్లు తీసుకుంటూ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ పేదలను దోచుకుంటున్నాడని ఆరోపించారు. యువతను మద్యానికి బానిసలుగా మార్చిన చరిత్ర అతనిదేనని విమర్శించారు. కొండాపూర్ సీఐ, ఎస్ఐలు తనను చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. అలాగే సంగారెడ్డి డీఎస్పీ తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని తెలిపారు.
పల్లె ప్రకృతి వనం ధ్వంసం చేసిన ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి న్యాయపోరాటం చేస్తానన్నారు. కంపెనీల్లో వాటాల కోసం కొందరు మూటలు పంచుకునేందుకు పోటీ పడుతున్నారని విమర్శించారు. కంపెనీ ఆలయాలకు వెళ్లే దారిని వదిలివేయాలని డిమాండ్ చేశారు. గంజాయి, డ్రగ్స్ కేసులో సీసీఎస్ పోలీసులు తీసుకెళ్లిన ప్రశాంత్గౌడ్ను మస్కు నర్సింహారెడ్డి, వై.ప్రభు తీసుకువచ్చారని, దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
కాంగ్రెస్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వలేదన్నారు. ఎన్నికల ముందు పెన్షన్ రాని వారికి సొంత డబ్బులతో పెన్షన్లు ఇస్తామని, పెళ్లిళ్లకు డబ్బులు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ప్రశాంత్గౌడ్పై ఆరోపణలు చేశారు. తనపై చేస్తున్న ఆరోపణలకు దమ్ముంటే ప్రశాంత్ ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు.
