9Vehicles | మోదీ.. బాటలో

9Vehicles | మోదీ.. బాటలో
9Vehicles | ఏపీ, తెలంగాణ సీఎంలూ పొదుపు మంత్ర
ఇప్పటికే కాన్వాయ్లలో కోత విధించిన చంద్రబాబు, రేవంత్
మంత్రులకు సైతం వాహనాలు కట్
ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వాహన షేరింగ్ ప్రతిపాదన
సాధ్యమైనంత వరకు ప్రజారవాణా వినియోగించాలని ఆదేశం
పగటి పూట ఏసీలు కట్.. సోలార్ పవర్కు ప్రాధాన్యం
వాహన శ్రేణిలో విద్యుత్ వాహనాలపై మొగ్గు
9Vehicles | సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇంధన పొదుపు చర్యలను చేపట్టడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగులు వేస్తున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండటంతో పాటు ప్రభుత్వ ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో సగానికి తగ్గుతున్న కాన్వాయ్లు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమ భద్రతా వాహనాల శ్రేణిని (కాన్వాయ్) గణనీయంగా తగ్గించుకోవాలని నిర్ణయించారు. సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రులు పర్యటించే సమయంలో పెద్ద సంఖ్యలో వాహనాలు వెంట రావడం సహజం. అయితే ఇకపై జిల్లాల్లో పర్యటించేటప్పుడు తమ కాన్వాయ్లలో ఉండే వాహనాల సంఖ్యను 50 శాతానికి తగ్గించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కేవలం వీరు మాత్రమే కాకుండా, మంత్రులు, ఇతర వీఐపీలు కూడా సాధ్యమైనంత తక్కువ వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక ప్రభుత్వకార్యాలయాలలో పగటి సమయంలో ఏసీలు వేయరాదని ఆదేశాలిచ్చారు. సోలార్ పవర్ తో నడిచే కార్యాలయాలకు మినహాయింపు ఇచ్చారు.. ఇక ఉన్నతస్థాయి ఉద్యోగులు షేరింగ్ కార్లను మాత్రేమే వినియోగించాలని కోరారు.. సాధ్యమైనంతవరకు కార్యాలయాలకు వచ్చేందుకు ప్రజారవాణ వ్యవస్థను వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
పవన్ కల్యాణ్ సైతం.
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పొదుపు చర్యలు పాటిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, అదే బాటలో రాష్ట్రంలోనూ ఈ విధానాన్ని కొనసాగించాలని పవన్ కల్యాణ్ తన కార్యాలయం ద్వారా వెల్లడించారు. ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియా వేదికగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గురువారం జరగనున్న క్యాబినెట్ భేటీలో ఈ పొదుపు చర్యలకు సంబంధించి మరిన్ని కీలక విధాన నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి కూడా..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను కుదించుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కాన్వాయ్లో సుమారు 9 వాహనాలు ఉండగా, వాటిని 4 నుంచి 5 వాహనాలకు పరిమితం చేసేలా కసరత్తు చేయాలని భద్రతా విభాగం పోలీసు అధికారులకు సూచించినట్లు సమాచారం. ఆయన తన నివాసం నుంచి ఎంసీఆర్హెచ్ఆర్డీకి వెళ్లే క్రమంలో కేవలం మూడు వాహనాలతోనే ప్రయాణించడం ద్వారా తన సంకల్పాన్ని చాటుకున్నారు. ఈ అంశంపై రాబోయే రెండు రోజుల్లో స్పష్టత రానుంది, తద్వారా మంత్రుల కాన్వాయ్లలో కూడా వాహనాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.
