Textile Pochampally | ‘టెక్స్టైల్ పోచంపల్లి’ ప్రదర్శన
Textile Pochampally | ‘టెక్స్టైల్ పోచంపల్లి’ ప్రదర్శన
ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Textile Pochampally |ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “తెలంగాణ రైసింగ్ ” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన “త్రెడ్ పోచంపల్లి ” చేనేత వస్త్ర ప్రదర్శనను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఘనంగా ప్రారంభించారు. శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని హైటెక్స్లో చేనేత కళకు అండగా నిర్వహించనున్న మూడు రోజుల ‘థ్రెడ్ పోచంపల్లి’ (Thread Pochampally) ప్రదర్శనను మంత్రి కోమటిరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభించారు.
వేల సంవత్సరాల చరిత్ర కలిగిన చేనేత సంప్రదాయాన్ని భావితరాలకు అందించడం సమాజ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు లభించిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ అక్కడి కళాకారుల సృజనాత్మకతకు అంతర్జాతీయ గుర్తింపు అని తెలిపారు. భూదాన్ ఉద్యమానికి చారిత్రక కేంద్రంగా నిలిచిన పోచంపల్లి కి ప్రత్యేక స్థానం కలిగి ఉందని మంత్రి గుర్తుచేశారు. పోచంపల్లి రుమాళ్లు, ఇక్కత్ చీరలకు ప్రపంచ మార్కెట్లో మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
చేనేత రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండున్నర సంవత్సరాల్లో చేనేత రంగ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం సుమారు రూ.1,400 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. నేతన్నల ఉపాధికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
గ్లోబలైజేషన్ పోటీని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సంస్థ ద్వారా చేనేత కుటుంబాల పిల్లలకు ఆధునిక డిజైన్లు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవసరాలకు అనుగుణమైన శిక్షణ అందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
కార్యక్రమంలో మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, చేనేత కార్మికులు, కళాకారులు పాల్గొన్నారు.
