హైదరాబాద్, : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. 2025 – 28 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు మే 25న ఆన్లైన్లో నిర్వహించిన పరీక్ష ఫలితాలను అధికారులు నేడు విడుదల చేశారు. ఈ సారి 78.18 శాతం విద్యార్థులు ఈ పరీక్షలో క్వాలిఫై అయ్యారు. మొత్తం 48,815 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 33,321 మంది పరీక్షరాస్తే, వీరిలో 28,442 మంది అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు..
టాపర్లు వీరే..
మీడియం వారిగా టాపర్లను పరిశీలిస్తే తెలుగు మీడియంలో 77 మార్కులతో తక్కళ్లపల్లి హరిత స్టేట్ టాపర్గా నిలిచారు. ఇంగ్లీష్ మీడియంలో 87 మార్కులతో పసునూరి అభినవ రెడ్డి, ఉర్దూ మీడియంలో 67 మార్కులతో ఫరాజ్ ఆహ్మద్లు టాపర్లుగా నిలిచారు. మీడియం వారిగా తీసుకుంటే తెలుగు మీడియంలో 19,900 మంది విద్యార్థులకు 15,478 మంది పరీక్షకు హాజరుకాగా, వీరిలో 11,288 (72.79శాతం) క్యాలిఫై అయ్యారు. ఇంగ్లీష్ మీడియంలో 22,051 మంది దరఖాస్తు చేసుకోగా, 18,983 మంది పరీక్ష రాయగా, 14,848 (38,94శాతం) క్వాలిఫై అయ్యారు. ఉర్దూమీడియంలో 1,884 మందికి 1,982 మంది పరీక్షరాస్తే, వీరిలో 530 మంది అర్హతసాధించారు.
19 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్
డీఈఐఈడీ, డీపీఎస్ఈ కోర్సుల్లోని సీట్ల భర్తీ కౌన్సెలింగ్ ఈ నెల 9 నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 9 నుంచి 13 వరకు రాష్ట్రంలోని 10 డైట్ కాలేజీల్లో అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఈ నెల 14 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా డైట్ కాలేజీల్లో నాలుగువేల వరకు సీట్లున్నట్లు సమాచారం.