వచ్చేవారం నుంచి ఇందిరమ్మ ఇళ్లు
నియోజవర్గానికి 3500 కేటాయింపు
అర్హులందరికీ అందేలా చూస్తాం
చిత్తశుద్ధితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది
స్పష్టం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం , ఆంధ్రప్రభ : తులం బంగారం ఇవ్వడం లేట్ అయ్యిందని, అయినా.. ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని మంత్రి పొంగులేటీ శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేవారం నుంచి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. పేదవారి ప్రభుత్వం కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని ఈ రోజుతో 15 నెలలు అయిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్దిక పరిస్ధితి అస్తవ్యస్ధంగా తయారైందని, అయినా తెలంగాణ ప్రజానీకానికి ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. అర్హులైన వారికి అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు బాగోలేని కారణంగా తులం బంగారం ఆలస్యమవుతుందని అన్నారు.
అర్హులందరికీ అందేలా చర్యలు
ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇళ్లు కేటాయించినట్లు మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇళ్లు అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాపాలనలో అర్హులందరికీ ఇళ్లు మంజూరవుతాయన్నారు. ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టించిందన్నారు. వాటన్నింటినీ గాడిన పెడుతూ అభివృద్ధి, సంక్షేమం చేపడుతున్నామన్నారు. ఎక్కడ తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు.పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్త శుద్దితో పని చేస్తోందన్నారు. ఇచ్చిన ప్రతి మాటను..హామీని ఆలస్యమైనా నిలబెట్టుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు.