విభజన హామీలు, పోలవరంపై కీలక చర్చలు
విభజన హామీలు, పోలవరంపై కీలక చర్చలు
ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్ర విభజన హామీల అమలు, అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిధులు వంటి అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ఇంకా పెండింగ్లో ఉన్న అంశాలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే అమరావతిలో మరిన్ని కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం.
అమరావతి నిర్మాణ పనుల పురోగతిని వివరిస్తూ కేంద్రం నుంచి మరింత ఆర్థిక సహకారం అందించాలని చంద్రబాబు కోరినట్లు తెలిసింది. అలాగే కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అమిత్ షాను అభ్యర్థించినట్లు సమాచారం.
