పేకాట స్థావరంపై పోలీసుల దాడి
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
జైనూర్, ఆంధ్రప్రభ:
ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడి నిర్వహించి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
గురువారం సిర్పూర్ (యు) మండలం మహాగావ్ గ్రామంలో పేకాట నిర్వహిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టైన వారి వద్ద నుంచి రూ.39 వేల నగదు, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్ డీఎస్పీ కార్యాలయంలో వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
అరెస్టైన వారిలో కొడప గంగారాం (పటేల్గూడ), మడావి దుర్నాథ్ (పటేల్గూడ), జాదవ్ అంబాజీ (లింగాపూర్), ఆడే గంగారాం (లింగాపూర్), షేక్ నసీరుద్దీన్ (జైనూర్), షేక్ అబ్బాస్ (జైనూర్), మహమ్మద్ సలీం ఖాన్ (జైనూర్), మహమ్మద్ జాకీర్ (ఉట్నూర్) ఉన్నారు. దశరథ్ (కెరమెరి) పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
జిల్లాలో పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అశోక్ హెచ్చరించారు.
ఈ దాడిలో జైనూర్ సీఐ రమేష్, సిర్పూర్ (యు) ఎస్ఐ విక్రమ్ పాల్గొన్నారు.
