cyber crime | ‘డిజిటల్ అరెస్ట్’ల‌కు.. క‌ళ్లెం

cyber crime | ‘డిజిటల్ అరెస్ట్’ల‌కు.. క‌ళ్లెం

cyber crime | కొత్త విధానాన్ని తీసుకొస్తున్నకేంద్రం
సిమ్ కార్డు జారీ చేసే సమయంలో బయోమెట్రిక్ త‌ప్ప‌ని స‌రి
సోష‌ల్ మెస్సేజ్ యాప్‌ల‌లో క‌ఠిన ఆంక్ష‌లు
ఫేక్ కాల్ చేసిన సెల్, డివైజ్‌లు క్ష‌ణాల్లో బ్లాక్
పెద్ద మొత్తంలో మ‌నీ ట్రాన్స్ ఫ‌ర్ చేస్తే.. గంట పాటు హోల్డ్
డిజిట‌ల్ అరెస్ట్ అనేది లేద‌నే దానిపై విస్తృ ప్ర‌చారం
సైబ‌ర్ నేరం జ‌రిగిన వెంట‌నే 1930కి కాల్ చేయాల‌ని సూచ‌న

cyber crime | న్యూ ఢిల్లీ, ఆంధ్ర్ర‌ప్ర‌భ : ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ భయపెడుతున్న పేరు ‘డిజిటల్ అరెస్ట్’. పోలీసులు లేదా సీబీఐ అధికారులమని ఫోన్ చేసి, ఇంట్లోనే బంధించి డబ్బులు దోచుకునే ఈ ముఠాల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేయడంతో, సైబర్ నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా కొత్త నిబంధనలను కేంద్రం ప్రతిపాదించింది. ఇకపై ఫేక్ కాల్స్ చేస్తే చట్రంలో చిక్కుకోవడం ఖాయం.

బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి
ఇప్పటి వరకు ఎవరి పేరు మీదో ఉన్న సిమ్ కార్డులు కొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడేవారు. ఇకపై అది సాధ్యం కాదు. సిమ్ కార్డు జారీ చేసే సమయంలో బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను కేంద్రం తప్పనిసరి చేయబోతోంది. అంటే వేలిముద్రలు లేదా కంటి గుర్తులు సరిపోలితేనే సిమ్ యాక్టివేట్ అవుతుంది. తప్పుడు వివరాలతో సిమ్ కార్డులు అమ్మే విక్రయదారులపై కూడా కఠిన నిఘా ఉంచనున్నారు.

నేరగాళ్లు ఎక్కువగా వాట్సాప్ వంటి యాప్‌ల ద్వారానే డిజిటల్ అరెస్ట్ కాల్స్ చేస్తున్నారు. అందుకే ఇలాంటి యాప్‌లు తమ సెక్యూరిటీని పెంచాలని కేంద్రం సూచించింది. ఎక్కువ సేపు సాగే అనుమానాస్పద కాల్స్‌ను గుర్తించేలా కొత్త ఫీచర్లను తీసుకురావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా, మోసాలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు లేదా కంప్యూటర్ల ఐడీలను వెంటనే బ్లాక్ చేయనున్నారు.

బ్యాంకు ఖాతాల నిలిపివేత

cyber crime

సైబర్ మోసాల్లో డబ్బు పోగానే దాన్ని వెంటనే వేరే అకౌంట్‌లోకి మళ్లించకుండా ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకురాబోతోంది. ఏదైనా అకౌంట్ అనుమానాస్పదంగా అనిపిస్తే, అందులో నుంచి డబ్బు డెబిట్ కాకుండా తాత్కాలికంగా హోల్డ్‌లో పెడతారు. ఇక దీనివల్ల బాధితులు కోల్పోయిన సొమ్ము నేరగాళ్ల చేతికి చిక్కకుండా కాపాడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ప్రత్యేక ఆపరేటింగ్ ప్రొసీజర్ సిద్ధమవుతోంది.

సైబర్ నేరగాళ్ల డివైజ్‌ల పని ఖతం
ఒకసారి ఏదైనా ఫోన్ లేదా ల్యాప్‌టాప్ నుంచి నేరం జరిగిందని తేలితే, ఆ డివైజ్‌ను మళ్లీ వాడకుండా పూర్తిగా బ్లాక్ చేస్తారు. నిందితులు మళ్లీ వేరే అకౌంట్‌తో అదే ఫోన్ నుంచి మోసం చేయాలనుకున్నా కుదరదు. అలాగే ఇక సిమ్ కార్డులను బ్లాక్ చేయడంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, వెంటనే చర్యలు తీసుకునేలా టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేయనున్నారు.

సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక
కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలన్నింటినీ ఒక నివేదిక రూపంలో సుప్రీంకోర్టుకు సమర్పించింది. టెలికాం శాఖ, ఐటీ శాఖ, ఆర్బీఐ సమన్వయంతో పనిచేయాలని కోరింది. అటార్నీ జనరల్ ఈ వివరాలను న్యాయస్థానానికి వివరించారు. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే డిజిటల్ అరెస్ట్ పేరుతో సామాన్యులను భయపెట్టే గ్యాంగ్‌ల పని ముగిసినట్లేనని నిపుణులు చెబుతున్నారు.

డిజిటల్ అరెస్ట్ అనేది ఒక పెద్ద స్కామ్ అని, పోలీసులు ఎప్పుడూ ఫోన్ కాల్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయరని ప్రజలు గుర్తించాలి. కేంద్రం తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేస్తాయని ఆశిద్దాం. ఇక ఏదేమైనా గుర్తుతెలియని వీడియో కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండటం, ఏదైనా అనుమానం వస్తే వెంటనే ‘1930’ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం మన బాధ్యత అని అంద‌రూ గుర్తించాలి.

click here to read 59.5%AI jobs | ‘ఏఐ హబ్’గా.. భార‌త్

click here to read more

Leave a Reply