ఒక్క ఓటు మిస్ కావొద్దు..
- ఎస్ఐఆర్ నమోదు పై అవగాహన కలిగి ఉండాలి
- ఓటర్లను నేరుగా కలిసే అవకాశం
- బీఎల్వోలు, పార్టీ నాయకులతో సమన్వయం చేసుకోవాలి
- మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి
మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఓటర్ల జాబితాలో ఒక్క ఓటు మిస్ కాకుండా చూడాలని మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సిలు ఫారూక్ హుస్సేన్, శేరి సుభాష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు కంఠరెడ్డి తిరుపతిరెడ్డిలతో కలిసి ఎస్ఐఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా మరోసారి ఓటర్లను నేరుగా కలిసే అవకాశం లభించిందన్నారు. ప్రతి ఓటరును కలిసి వారి ఓటు నమోదును నిర్ధారించడం పార్టీ కార్యకర్తల బాధ్యతగా భావించాలని సూచించారు.
ఎస్ఐఆర్ ద్వారా ఓటర్ల నమోదుపై కార్యకర్తలు, నాయకులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. వార్డుల్లో ఓటర్ల నమోదుకు సంబంధించిన సందేహాలు ఉంటే పార్టీ నాయకులు, బీఎల్వో ఏజెంట్లను సంప్రదించాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటర్ల జాబితాలో పేర్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకోవడం వల్ల స్థానిక ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుందని, అలాంటి సందర్భాల్లో వెంటనే బీఎల్వోలను కలిసి నమోదు ప్రక్రియ పూర్తి చేయించాలని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ మాట్లాడుతూ.. మెదక్ నియోజకవర్గంలో ఒక్క ఓటు మిస్ కాకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని కోరారు. వర్గాలకు అతీతంగా ఎస్ఐఆర్పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పార్టీ ఆదేశాలను అమలు చేయాలన్నారు.
మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో నిర్దేశించిన గడువులోగా బీఎల్వోలను కలిసి ప్రతి అర్హుడి ఓటు నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు కంఠరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు ఎస్ఐఆర్ కార్యక్రమం పై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరి ఓటు నమోదయ్యే వరకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు యం. దేవేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ లు అరెళ్ళ మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, కౌన్సిలర్లు బట్టి ఉదయ్ కుమార్, దీపక్ కుమార్, జుబేర్ అహ్మద్, సోహెల్, మాజీ కౌన్సిలర్లు భీమరి కిషోర్, మాయ మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, నాయకులు ప్రభురెడ్డి, కృష్ణ గౌడ్, సురేందర్ గౌడ్, అంజాగౌడ్, కిష్టయ్య, శ్రీనివాస్ రెడ్డి, మాణిక్య రెడ్డి, లక్ష్మీనారాయణ, ఇందాద్, మాయ శ్రీనివాస్, ఇస్మాయిల్, సాయి, బీఎల్ఏలు, నియోజకవర్గంలోని మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
