మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ సలహాదారుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అటవీ శాఖ ప్రభుత్వ సలహాదారు మల్లికార్జునరావు (రిటైర్డ్) IFSతో నిర్వహించిన ఈ సమావేశంలో, అటవీ శాఖ చేపట్టిన కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యల గురించి ప్రత్యేక చర్చలు జరిపారు.
రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, వన్యప్రాణులు – మానవుల మధ్య సంఘర్షణలను నివారించడానికి తీసుకోవలసిన మరిన్ని చర్యల గురించి చర్చించారు. అలాగే, అటవీ సంరక్షణలో స్థానిక ప్రజల పాత్రను పెంచడానికి, పర్యావరణ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి, మొక్కల పెంపకం, కలప ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
గతంలో నిర్ణయించిన ప్రణాళికలను నిర్ణీత కాలపరిమితిలో అమలు చేయడానికి, స్థానిక ప్రజలకు, పర్యావరణానికి ప్రయోజనకరమైన స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి, అటవీ శాఖలో తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడానికి పూర్తి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో పంచాయత్ రాజ్ కమీషనర్ మైలవరపు కృష్ణ తేజ ఐఏఎస్, ఉపముఖ్యమంత్రి ఓఎస్డీ వెంకట కృష్ణ, అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఫారెస్ట్రీ ఎన్.వి.శివరామ్ ప్రసాద్ పాల్గొన్నారు.