పోలీసులకు వేముల వీరేశం ఫిర్యాదు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంను టార్గెట్ చేసి న్యూడ్ కాల్స్తో బెదిరింపులకు దిగారు. న్యూడ్ వీడియో కాల్ను రికార్డు చేసి ఆయన మొబైల్కు పంపించడమే కాకుండా.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డబ్బులు ఇవ్వాలని డిమాండ్…
నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు మంగళవారం రాత్రి సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. ఆ కాల్ లిఫ్ట్ చేయగానే అవతలి అమ్మాయి నగ్నంగా కనిపించింది. మొబైల్ స్క్రీన్పై ఆ సీన్ చూడగానే వేముల వీరేశం ఫోన్ కట్ చేశాడు. కానీ అదంతా స్క్రీన్ రికార్డు చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆ వీడియోను ఆయనకే పంపించారు. తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ వీడియోను కుటుంబ సభ్యులు, మిత్రులకు పంపించడమే కాకుండా సోషల్మీడియాలో అప్లోడ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
పోలీసులకు ఫిర్యాదు…
సైబర్ నేరగాళ్లు వార్నింగ్కు నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం స్పందించలేదు. దీంతో ఆ వీడియోను కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు పంపించారు. ఆ వీడియో చూసిన పలువురు నేతలు వీరేశం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. పోలీసుల సలహాలతో సైబర్ నేరగాళ్ల నంబర్ను ఎమ్మెల్యే బ్లాక్ చేశారు.