జూబ్లీహిల్స్ లో ముగిసిన పోలింగ్

- ఓటింగ్ 50.18 శాతం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ శాతం మాత్రం కేవలం 50 శాతమే నమోదైంది. ఉదయం నుంచే మందకొడిగా సాగిన ఓటింగ్.. రోజు ముగిసే సమయానికి కూడా పెద్దగా ఊపందుకోలేదు. సాయంత్రం ఆరు గంటల వరకు 50.18 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అంటే, కేవలం సగం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవ్వగా… ప్రారంభం నుంచి రెండు గంటల మధ్య కేవలం 9.2 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొమ్మిది నుంచి ఓటర్లు రావడం ప్రారంభించారు.
మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 31.94 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 40.20 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐదు గంటలకు 47.18 శాతం పోలింగ్ నమోదైంది.
