హుజూర్నగర్ (ఆంధ్రప్రభ): హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం లారీ, బస్సు, ఆటో డ్రైవర్లు, వాహన చోదకులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ చరమందరాజు మాట్లాడుతూ.. రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లైసెన్స్ లేకుండా లేదా మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు.
వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, అతివేగంగా లేదా అజాగ్రత్తగా వాహనాలు నడపడం ప్రాణాలకు ముప్పు తెస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మోహన్బాబు, ఎంపీడీవో లావణ్య, ఆర్అండ్బీ అధికారులు, డ్రైవర్లు పాల్గొన్నారు.

